ప్రేమ పేరుతో వేధింపులు, ఇంటర్‌ విద్యార్థినిపై లైంగిక దాడి

Chittor: Man Molested A Young Woman Due To Not Loving Him - Sakshi

పోలీసుల అదుపులో నిందితుడు

సాక్షి, చిత్తూరు ‌: తనను ప్రేమించడం లేదని చెప్పిందని యువతి(19)పై నగరానికి చెందిన సాయికుమార్‌(21) లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు .. నగరంలోని పాత ప్రశాంత్‌నగర్‌కు చెందిన 19 ఏళ్ల యువతి  ఓ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమెకు ధర్మరాజులగుడివీధికి చెందిన సాయికుమార్‌తో ఇటీవల పరిచయం ఏర్పడింది. ఇతను భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. రెండు నెలలుగా తనను ప్రేమించాలంటూ యువతిపై ఒత్తిడి తెస్తున్నాడు. ఇతని గురించి ఆరాతీసిన యువతి.. తనను ప్రేమ పేరిట వేధించొద్దని, ఇష్టంలేదని స్పష్టంచేసింది. అయినా సరే వదలకుండా ఫోన్లు చేసేవాడు.
(చదవండి: దారుణం: ప్రేమించి పెళ్లిచేసుకొని.. రెండు కత్తులతో )

సోమవారం రాత్రి యువతికి ఫోన్‌చేసి ‘నన్ను ఎందుకు వద్దంటున్నావో ఒక్కసారి నేరుగా చెప్పు.. దాని తరువాత నీజోలికి రాను’అని చెప్పడంతో తేనబండలోని ఓ భవనం వద్దకు యువతి వెళ్లింది. అక్కడ మాటలతో మొదలై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనను తిరస్కరించిందని అతను ఆగ్రహించాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి పారిపోయాడు. బాధితురాలు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆమెను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి యువతి నుంచి వాంగ్మూలం తీసుకున్న టూటౌన్‌ సీఐ యుగంధర్‌ కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top