రూ.500 కోసం బాలుడి హత్య | Boys assassination for Rs 500 | Sakshi
Sakshi News home page

రూ.500 కోసం బాలుడి హత్య

Sep 3 2023 4:39 AM | Updated on Sep 3 2023 4:39 AM

Boys assassination for Rs 500 - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం: కేవలం ఐదే ఐదు వందల రూపాయల కోసం ఓ బాలుడిని  హత్య చేసిన దారుణ ఘటన మహబూబ్‌నగర్‌లో వెలుగుచూసింది. టూటౌన్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ చెప్పిన వివరాల మేరకు.. న్యూటౌన్‌లోని ఓ హోటల్లో వెయిటర్‌గా పని చేస్తున్న ఫరూక్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ సిద్ధిక్‌ ఉల్లాఖాన్‌ ఆగస్టు 20న స్థానికంగా పండ్లు విక్రయించే సయ్యద్‌ ఖదీర్‌ వద్ద సెల్‌ఫోన్‌ విక్రయించి రూ.2వేలు తీసుకున్నాడు.

మరుసటిరోజు మళ్లీ ఖదీర్‌ వద్దకెళ్లి మరో రూ.200 ఇవ్వాలని అడిగాడు. సెల్‌ఫోన్‌ చార్జర్‌ ఇస్తే..డబ్బులు ఇస్తానని ఖదీర్‌ చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన షహిరియార్‌(16).. తాను గతంలో ఇచ్చిన రూ.500 తిరిగి ఇవ్వాలని మహ్మద్‌ సిద్ధిక్‌ ఉల్లాఖాన్‌ను అడిగాడు. తాను హోటల్‌లో పనికి వెళ్లడం లేదని, తన దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవని తర్వాత ఇస్తానని చెప్పాడు.

జేబులో నుంచి రూ.300 తీసుకున్నాడని.. 
కాగా,  షహిరియార్‌కు ఫోన్‌ ఇచ్చి షాసాబ్‌గుట్టలో ఉండే తన రూంకు పంపిస్తే ఫోన్‌కు సరిపడా చార్జర్‌ చెక్‌ చేసి ఇస్తానని ఖదీర్‌కు చెప్పాడు. ఈ క్రమంలో రూం వద్దకు వెళ్లిన షహిరియార్‌ చార్జర్‌ తీసుకున్న తర్వాత ఉల్లాఖాన్‌ జేబులో ఉన్న రూ.300 తీసుకున్నాడు. నాకు రూ.500 ఇవ్వాలి కదా.. ఈ రూ.300మినహాయించుకో అని చెప్పాడు.

అయితే  నా జేబులో నుంచే డబ్బులు తీసుకుంటావా అని ఆగ్రహంతో ఊగిపోయిన ఉల్లాఖాన్‌  ’నిన్ను చంపితే రూ.500తో పాటు సెల్‌ఫోన్‌ మిగిలిపోతాయ’ని అంటూ  షహిరియార్‌ గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. పదిరోజుల కిందట అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు శనివారం నిందితుడు మహ్మద్‌ సిద్ధిక్‌ ఉల్లాఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్యచేసినట్లు తేలడంతో  అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement