చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రజా ఫిర్యాదు ల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించకుండా, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఎస్పీ తుషార్ డూడీ స్పష్టంచేశారు. సోమవారం చిత్తూరు నగరంలోని పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో నాన్ క్యాడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు, ఏఎస్పీ షాను, ఎస్డీపీఓ వెంకటనారాయణతో కలిసి అర్జీలు స్వీకరించారు. సమస్యలపై స్పందించి చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 37 ఫిర్యాదు లు అందాయి. ఇందులో భూ తగాదాలు 9, ఇంటి తగాదాలు 5, ఆస్తి–డబ్బు వివాదాలు 8, చీటింగ్– వేధింపులు 6, దారి–చిన్న గొడవలు 6 తదితర సమస్యలపై అర్జీలు నమోదయ్యాయి.
డైట్ పూర్వ వైభవమే లక్ష్యం
కార్వేటినగరం: జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) కు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని నూతన ప్రిన్సిపల్ విజయేంద్ర రావు తెలిపారు. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భగా ప్రిన్సిపల్ను ఏపీటీఎఫ్ నేతలు ఘనంగా సత్కరించారు. విజయేంద్రరావు మాట్లాడుతూ డైట్ను అభివృద్ధి చేసి ఛాత్రోపాధ్యాయులకు చక్కటి వసతులతో కూడిన శిక్షణ అందించేందుకు కృషి చేస్తామన్నారు. గతంలో డీఈఓగా పనిచేసినప్పుడు సైతం డైట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.చలపతిరావు, కార్వేటినగరం మండల ప్రధాన కార్యదర్శి ధనంజయులు, డైట్ఽ అధ్యాపకులు రాజ్కుమార్, హేమలత పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 81,553 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 34,483 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.


