సాక్షి టాస్క్ఫోర్స్: చిత్తూరు మండలం అనంతాపురం గ్రామంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఒక్కసా రిగా భగ్గుమన్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే పర్యటిస్తుండగానే, ఆయన కళ్లముందే ఒక సీనియర్ కార్యకర్తపై మరో నేత కరల్రతో విరుచుకుపడి భౌతిక దాడికి దిగడంతో శనివారం చిత్తూరు నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపింది.
ఎమ్మెల్యే కళ్లముందే రౌడీయిజం
గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త ప్రవీణ్ గత కొన్నాళ్లుగా తన నివాస స్థల సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడు శనివారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం పేరుతో గ్రామానికి వస్తున్నారని తెలిసి, సమస్యను విన్నవించి వినతిపత్రం ఇచ్చేందు కు గ్రామస్తులతో కలిసి రోడ్డుపై వేచి చూశారు. అయి తే ఎమ్మెల్యే వాహనం ఆగకుండా వెళ్లడంతో, వారు పంచాయతీ కా ర్యాలయం వద్దకు వెళ్లారు. సరిగ్గా పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్న ప్రవీణ్పై టీడీపీ నాయకుడు జయచంద్రనాయుడు, ఆయన డ్రైవర్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అత్యంత హేయమైన పదజాలంతో దూషిస్తూ కరల్రతో తీవ్రంగా కొట్టారు. కళ్లెదుటే సొంత పార్టీ కార్యకర్తపై దౌర్జన్యం జరుగుతున్నా ఎమ్మెల్యే అడ్డుకోకపోవడం గమనార్హం. దీంతో ఆగ్రహించిన బాధితు డు రోడ్డుపైనే బైఠాయించాడు. పోలీసులు రంగంలోకి దిగి అతని అదుపులోకి తీసుకున్నారు.
ఇసుక దందా వెనుక అసలు కథ..?
ఈ దాడి వెనుక పెద్ద ఇసుక కథే ఉన్నట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది. మూడు రోజుల క్రితం అనంతాపురం పరిసరాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా పై ప్రవీణ్ నేరుగా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్కు ఫిర్యా దు చేశారని జయచంద్రనాయుడు దృష్టిలో పడింది. ఈనేపథ్యంలోనే జయచంద్రనాయుడు ప్రవీణ్పై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇసుక అక్రమాలను అడ్డుకున్నందుకే ఈ దాడికి ఒడిగట్టారని టీడీపీలోని రెండు వర్గాలు కోడై కూస్తున్నాయి.
బాధితుడి ఆవేదన ఇలా ..
‘‘నేను 2008 నుంచి పార్టీకి నమ్మకమైన కార్యకర్తగా పనిచేస్తున్నాను. నివాస స్థల సమస్యపై ఎమ్మెల్యేకి వినతిపత్రం ఇద్దామని వస్తే, సొంత పార్టీ నేత జయచంద్రనాయుడే నాపై దారుణంగా దాడి చేశారు. దెబ్బలుతిన్న నాపైనే కేసులు పెట్టిస్తామని బెదిరిస్తుండడం దారుణం. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారిపై రౌడీయిజం చేస్తున్నారు. ఒక్క ఇసుక బ్యాగ్ను కూడా అక్రమంగా తరలించనిచ్చేది లేదు. ఈ అక్రమాలు, దాడులపై మంగళగిరిలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తా’’ అని ప్రవీణ్ శపథం చేసినట్లు తెలిసింది.


