
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్మార్ట్ఫోన్ తయారీదారు అయిన షియోమీ (Xiaomi) తన 'వైయూ7' ఎలక్ట్రిక్ కారు అమ్మకాలను జూలైలో ప్రారంభించనున్నట్లు.. కంపెనీ సీఈఓ 'లీ జున్' పేర్కొన్నారు. ఈ కొత్త మోడల్ చైనాలో టెస్లా బెస్ట్ సెల్లింగ్ కారు 'వై'కి ప్రత్యక్ష పోటీదారుగా ఉంటుంది.
చైనా సంస్థ 'షియోమీ' ఇప్పటికే తన లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ 'ఎస్యూ7' (SU7) అల్ట్రా కారును కూడా మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు మరో కారును తీసుకురావడానికి సన్నద్ధమైంది. ఈ కొత్త వైయూ7 ఎలక్ట్రిక్ కారు.. ఒక సింగిల్ ఛార్జితో 835 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని ధర 60,000 - 70,000 యువాన్ల (సుమారు రూ.8 లక్షలు) వరకు ఉండే అవకాశం ఉంది. అయితే అధికారిక ధరలు జులైలో వెల్లడవుతాయి. ఈ కారు డిజైన్, ఇతర ఫీచర్స్ అన్నీ కూడా త్వరలోనే వెల్లడవుతాయి.
ఎస్యూ7 ఎలక్ట్రిక్ కారు
షియోమీ లాంచ్ చేసిన ఎస్యూ7 ఎలక్ట్రిక్ కారు 2,58,000 యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందినట్లు తెలుస్తోంది. ఇది స్టాండర్డ్, ప్రో, మ్యాక్స్ అనే మూడు వెర్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.25.18 లక్షలు, రూ. 28.67 లక్షలు, రూ. 34.97 లక్షలు. ఇవి మూడు చూడటానికి చాలా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువమంది వీటిని ఇష్టపడి కొనుగోలు చేశారు.
ఇదీ చదవండి: ఆ ఒక్క రాష్ట్రంలోనే ఐదు లక్షల కార్లు: SIAM డేటా..
ఆరు కలర్ ఆప్షన్లలో లభించే షియోమీ ఎస్యూ7 ఎలక్ట్రిక్ కారు 5.28 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ/గం కాగా.. ఇది 400 న్యూటన్ మీటర్ టార్క్, 299 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 73.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జీతో గరిష్టంగా 800కిమీ రేంజ్ అందిస్తుంది.