కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఓపెన్ఏఐ.. భారత్లో తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా 'ప్రభ్జీత్ సింగ్'ను నియమించింది.
ప్రభ్జీత్ సింగ్ ఈ ఏడాది సెప్టెంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. భారత్లో AI వినియోగాన్ని మరింత విస్తరించడంతో పాటు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ విభాగాలు కృత్రిమ మేధస్సు ప్రయోజనాలను పొందేలా భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడంపై ఆయన దృష్టి సారించనున్నారు.
ప్రభ్జీత్ సింగ్కు టెక్నాలజీ రంగంలో విశేష అనుభవం ఉంది. గత 11 సంవత్సరాలుగా ఉబెర్లో పనిచేసిన ఆయన, చివరి ఆరేళ్లు ఆ రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్కు భారతదేశం - దక్షిణాసియా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రైడ్-హెయిలింగ్ మార్కెట్లలో ఒకటైన భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంకలలో కంపెనీ మొబిలిటీ వ్యాపారానికి ఆయన నాయకత్వం వహించి, దాని విస్తరణకు మార్గనిర్దేశం చేశారు.
ఐఐటి ఖరగ్పూర్, ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన సింగ్, మెకిన్సీ & కంపెనీలో అసోసియేట్ పార్టనర్గా పనిచేసి, అంతకుముందు ఉబర్లో చేరారు. కార్పొరేట్ నాయకత్వానికి ఆయన చేసిన విశేష సేవలకు గాను, 2022లో ఐఐఎం అహ్మదాబాద్ వారి యంగ్ అలూమ్ని అచీవర్స్ అవార్డుతో ఆయనను సత్కరించారు.


