
2024 డిసెంబర్కల్లా రూ. 2.17 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం వొడాఫోన్ఐడియా రుణ భారం 2024 డిసెంబర్కల్లా 7 శాతం పెరిగి రూ. 2.17 లక్షల కోట్లకు చేరింది. చట్టబద్ధ లయబిలిటీల కారణంగా గత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికాని(అక్టోబర్–డిసెంబర్)కల్లా రుణ భారం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. 2023 డిసెంబర్ త్రైమాసికంలో రూ. 2,03,400 కోట్లుగా నమోదైనట్లు ఇన్వెస్టర్లకు తెలి యజేసింది. తాజా రుణ భారంలో ప్రధానంగా రూ. 2,14,700 కోట్లు ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిలుకాగా.. రూ. 2,300 కోట్లు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలుగా పేర్కొంది.
గత రెండేళ్లలో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలు రూ. 10,700 కోట్లమేర తగ్గినట్లు వెల్లడించింది. కాగా.. ఇటీవల ప్రభుత్వం గత టెలికం ప్యాకేజీలో భాగంగా రూ. 36,950 కోట్ల బకాయిలను ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో వొడాఫోన్ఐడియాలో ప్రభుత్వ వాటా 22.6 శాతం నుంచి 48.99 శాతానికి బలపడనుంది. ఇవి 2025–26, 2027 –28లో చెల్లించవలసిన స్పెక్ట్రమ్ బకాయిలుకాగా.. ప్రభుత్వ నిర్ణయానికంటే ముందున్న రుణ భార పరిస్థితిని వొడాఫోన్ఐడియా వాటాదారులకు వెల్లడించింది.
తాజాగా వాటా పెంపు
మంగళవారం(8న) కంపెనీ ప్రభుత్వానికి ఈక్విటీ షేర్ల కేటాయింపును పూర్తి చేయడంతో రుణ భారం తగ్గడంతోపాటు.. వొడాఫోన్ఐడియాలో ప్రభుత్వ వాటా 48.99 శాతాన్ని తాకింది. కంపెనీలో ప్రస్తు తం ప్రమోటర్లుగా వొడాఫోన్ గ్రూప్ 16.07 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్ 9.5 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. గతంలో ప్రభుత్వం రూ. 16,130 కోట్ల రుణాలను ఈక్విటీగా మార్పిడి చేసుకోవడంతో వొడాఫోన్ఐడియాలో 22 శాతానికిపైగా వాటా పొందిన విషయం విదితమే.