ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా దాదాపు ఆరేళ్లలో తొలిసారిగా లాభాల్లోకి మళ్లింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 2025–26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 51,970 లాభం ప్రకటించింది. చెల్లించాల్సిన ఏజీఆర్ బాకీలకు సంబంధించి కేంద్రం నుంచి వెసులుబాటు లభించడం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో వొడాఫోన్ ఐడియా రూ. 7,167 కోట్ల నష్టం నమోదు చేసింది. క్యూ4లో ఆదాయం 3 శాతం పెరిగి రూ. 11,229 కోట్ల నుంచి రూ. 11,332 కోట్లకు చేరింది. ఏజీఆర్పరమైన ఊరటని పరిగణనలోకి తీసుకోకుంటే.. నష్టం నాలుగో త్రైమాసికంలో రూ. 5,515 కోట్లుగా, పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 24,059 కోట్లుగా ఉంది.
మార్చి త్రైమాసికం ఆఖరు నాటికి యూజర్ల సంఖ్య 19.28 కోట్లుగా ఉంది. మిగతా అన్ని టెల్కోలతో పోలిస్తే ప్రతి యూజరుపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) అతి తక్కువగా రూ. 190గా ఉన్నప్పటికీ, వృద్ధి మాత్రం అత్యధికంగా 8.3 శాతంగా నమోదైంది. మరోవైపు, ప్రమోటర్ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్నకు చెందిన సూర్యజ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి రూ. 4,730 కోట్లు సేకరించనున్నట్లు సంస్థ తెలిపింది. ఇందుకోసం 430 కోట్ల వరకు వారంట్లను జారీ చేయనుంది.


