అప్పు కంటే ఎక్కువ రికవరీ చేశారు: విజయ్ మాల్యా ట్వీట్ వైరల్ | Vijay Mallya Claims Has Paid Double His Debt Tweet Viral | Sakshi
Sakshi News home page

అప్పు కంటే ఎక్కువ రికవరీ చేశారు: విజయ్ మాల్యా ట్వీట్ వైరల్

Dec 19 2024 4:32 PM | Updated on Dec 19 2024 6:42 PM

Vijay Mallya Claims Has Paid Double His Debt Tweet Viral

నేను చెల్లించాల్సిన మొత్తం కంటే.. బ్యాంకులు రెండింతలు ఎక్కువ రికవరీ చేశాయని విజయ్ మాల్యా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

డెట్ రికవరీ ట్రిబ్యునల్ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాన్ని రూ. 1200 కోట్ల వడ్డీతో సహా రూ. 6203 కోట్లుగా నిర్ణయించింది. అయితే బ్యాంకులు నా నుంచి ఏకంగా రూ. 14131.60 కోట్లు రికవరీ చేశాయని.. విజయ్ మాల్యా తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈడీతో పాటు బ్యాంకులు తాను చెల్లించాల్సిన అప్పుల కంటే రెండు రెట్లు ఎక్కువగా రికవరీ చేసుకున్నాయని వెల్లడించారు. అప్పులు రికవరీ అయ్యాక కూడా నేను ఆర్ధిక నేరస్తుడిని ఎలా అవుతానని ప్రశ్నించారు.

లోక్‌సభలో గ్రాంట్లకు సంబంధించిన సప్లమెంటరీ డిమాండ్‌లపై జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమాధానమిస్తూ.. మాల్యాకు చెందిన రూ. 14,131.6 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై మాల్యా స్పందిస్తూ.. ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: 9వ తరగతి స్టూడెంట్ ఖాతాలో రూ.87.63 కోట్లు

నాపైన సీబీఐ క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రభుత్వం, కొంతమంది విమర్శకులు చెబుతున్నారు. సీబీఐ ఏ క్రిమినల్ కేసులు పెట్టింది?. నేను ఒక్క రూపాయి కూడా లోన్ తీసుకోలేదు. దొంగిలించలేదు. కానీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణానికి గ్యారెంటర్‌గా.. ఐడీబీఐ బ్యాంక్ అధికారులతో సహా అనేక మంది ఇతర వ్యక్తులతో కలిసి ఐడీబీఐ బ్యాంక్ నుంచి.. వారి క్రెడిట్ కమిటీ, బోర్డు ఆమోదం పొందిన రూ.900 కోట్ల లోన్ మోసపూరితంగా పొందినట్లు సీబీఐ ఆరోపించింది. అయితే లోన్, వడ్డీ మొత్తం తిరిగి చెల్లించాను. 9 సంవత్సరాల తర్వాత మోస, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు ఎందుకు లేవు? అని కూడా మాల్యా ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement