హైదరాబాద్: భారతదేశంలోని అతిపెద్ద ప్రత్యేక బయోలాజిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్లలో (సీఎంఓ) ఒకటైన థెరానిమ్ కేంద్రాన్ని అరబిందో ఫార్మా ప్రారంభించింది. తెలంగాణ మంత్రులు డి. శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ సమక్షంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. బయోలాజిక్స్ తయారీలో కొత్త ప్రమాణాలను నెలకొల్పే ఈ ప్రాజెక్ట్కు ప్రముఖ ఔషధ సంస్థ ఎంఎస్డీ ప్రధాన కస్టమర్గా చేరింది.
ప్రారంభోత్సవానికి ముందు అరబిందో ఫార్మా డైరెక్టర్లు, ఎంఎస్డీ సీనియర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రాజెక్ట్ వివరాలు తెలియజేసి ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఈ ప్రాజెక్ట్ నిదర్శనంగా నిలుస్తుందని మంత్రులు పేర్కొన్నారు. బయోలాజిక్స్ కాంట్రాక్ట్ తయారీ రంగంలో అరబిందో ఫార్మా వ్యూహాత్మక విస్తరణలో భాగంగా ఏర్పాటైన థెరానిమ్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బయోలాజిక్ చికిత్సల డిమాండ్ను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది.


