
మ్యూచువల్ ఫండ్స్లో నా పెట్టుబడులను విక్రయించేందుకు గత ఆర్థిక సంవత్సరం చివరి రోజైన 2025 మార్చి 31న ఆర్డర్ పెట్టాను. నాకు చెల్లింపులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో వచ్చాయి. ఇక్కడ ఆర్థిక సంవత్సరం మారిపోయింది. అప్పుడు ఏ ఆర్థిక సంవత్సరంలో నా మూలధన లాభాలను పరిగణనలోకి తీసుకుంటారు? – చరణ్దాస్
ఇన్వెస్టర్లలో ఆర్థిక సంవత్సరం చివర్లో సాధారణంగా కనిపించే అయోమయమే ఇది. పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన తేదీ ఆధారంగానే మూలధన లాభాలపై పన్నును పరిగణనలోకి తీసుకుంటారు. అంతేకానీ, మీరు విక్రయ అభ్యర్థన ఎప్పుడు పెట్టారన్నది కాదు. సెబీ నిబంధనల ప్రకారం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉపసంహరణకు కటాఫ్ టైమ్ పనిదినాల్లో మధ్యాహ్నం 3 గంటలు.
మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థన సమర్పించినట్టయితే అదే రోజు నెట్ అసెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) ఆధారంగా ఆ లావాదేవీ ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత సమర్పించినట్టయితే తర్వాతి పనిదినం రోజు ఎన్ఏవీ ఆధారంగా ప్రాసెస్ చేస్తారు. మీరు 2025 మార్చి 31న సెల్ ఆర్డర్ పెట్టారు. ఆ రోజు మార్కెట్లకు సెలవు. కనుక మీ అభ్యర్థనను ఏప్రిల్ 1న ప్రాసెస్ చేయనున్నారు. కనుక పెట్టుబడుల విక్రయంపై వచ్చిన లాభాన్ని 2025–26 ఆర్థిక సంవత్సరం మూలధన లాభాలు కింద పరిగణనలోకి తీసుకుంటారు.
మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు వారసత్వంగా వచ్చినప్పుడు వాటిపై పన్ను ఎలా అమలవుతుంది? మూలధన లాభాల లెక్కింపునకు వాటి అసలు కొనుగోలు తేదీని పరిగణనలోకి తీసుకుంటారా లేక వారసులకు బదిలీ అయిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారా? – జె.తిరుమలరావు
అసలు పెట్టుబడిదారు మరణించిన సందర్భాల్లో మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు వారసులకు బదిలీ అయితే.. అప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పెట్టుబడులు మరొకరి పేరిట బదిలీ అయ్యాయే కానీ, విక్రయించలేదు. ఇక మూలధన లాభాలపై పన్ను లెక్కింపునకు మొదట పెట్టుబడి పెట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారు. బదిలీ అయిన రోజును కాదు.
ఈక్విటీ ఫండ్స్: ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల దీర్ఘకాల మూలధన లాభంపై (ఏడాదికి మించిన పెట్టుబడులు) పన్ను లేదు. అంతకుమించిన మొత్తంపై 12.5 శాతం చెల్లించాలి. అదే స్వల్పకాల మూలధన లాభాలపై (ఏడాదిలోపు విక్రయించినవి) 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
డెట్ ఫండ్స్: 2023 ఏప్రిల్ 1 తర్వాత పెట్టుబడి పెట్టి.. విక్రయించగా వచ్చిన లాభం ఇన్వెస్టర్ లేదా వారి వారసుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. వారికి వర్తించే శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. ఒకవేళ అసలు పెట్టుబడిని 2023 ఏప్రిల్ 1లోపు చేసి.. వాటిని రెండేళ్లలోపు విక్రయిస్తే లాభం మొత్తం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఆ ప్రకారం పన్ను చెల్లించాలి. రెండేళ్ల తర్వాత విక్రయిస్తే వచ్చిన లాభంపై నికరంగా 12.5 శాతం పన్ను చెల్లించాలి.
ఉదాహరణకు 2019 జనవరి 1న ఈక్విటీ ఫండ్స్లో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. 2024 జనవరిలో ఇన్వెస్టర్ కాలం చేశారు. ఈ పెట్టుబడులను వారి వారసులు 2025 మార్చిలో రూ.12 లక్షలకు విక్రయించారు.
ఏడాదికి మించిన పెట్టుబడి కనుక దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. అసలు పెట్టుబడి రూ.5 లక్షలు మినహాయించగా నికర లాభం రూ.7 లక్షలు అవుతుంది. ఇందులో రూ.1.25 లక్షలపై పన్ను లేదు. రూ.5.75 లక్షలపై 12.5 శాతం ప్రకారం రూ.71,875 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
సమాధానాలు:: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్