
రైల్వే తత్కాల్ టికెట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. కేవలం ఆధార్ ధ్రువీకరణ ఉన్న వ్యక్తులే జులై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించినున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. 'ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే టికెట్ బుకింగ్ అవకాశం కల్పించాలి అని రైల్వే శాఖ తన సర్క్యులర్ లో పేర్కొంది.
జులై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ బేస్డ్ ఓటీపీ కూడా తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. గత ఆరు నెలల్లో 2.5 కోట్ల అనుమానాస్పద ఐఆర్సీటీసీ ఐడీ (IRCTC ID)లను బ్లాక్ చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. టికెట్ బుకింగ్ కోసం బాట్ సాఫ్ట్వేర్లను ఉపయోగించినందుకు ఆయా ఐడీలను బ్లాక్ చేశారు. ఈ అనధికార ఐడీలను ఏరివేయడానికి వ్యక్తిగత వినియోగదారులకు తత్కాల్ ఈ-టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. రైల్వే శాఖకు చెందిన టికెట్ బుకింగ్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే వ్యక్తుల మొబైల్కు వచ్చే ఆధార్ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుందని సర్క్యులర్లో పేర్కొన్నారు.
ఏజెంట్లకు షాక్..
దీంతో పాటు ఆథరైజ్డ్ ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్కు తొలి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టంచేసింది. అంటే ఏసీ తరగతులకు 10.30 గంటల తర్వాత, నాన్ ఏసీ కోచ్లకు 11.30 గంటల తర్వాత మాత్రమే ఏజెంట్లకు టికెట్ బుకింగ్కు వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్సీటీసీ తమ సిస్టమ్స్ లో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. అనధికారిక టికెట్ బుకింగ్లను నిలిపివేయడానికి గానూ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

👉ఇదీ చదవండి: వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం