టాటా డిస్‌ప్లే చిప్స్‌ వస్తున్నాయ్‌.. | Tata Electronics setting up a display chip manufacturing unit in Gujarat | Sakshi
Sakshi News home page

టాటా డిస్‌ప్లే చిప్స్‌ వస్తున్నాయ్‌..

Mar 6 2025 8:18 AM | Updated on Mar 6 2025 8:18 AM

Tata Electronics setting up a display chip manufacturing unit in Gujarat

దేశీ కార్పొరేట్‌ దిగ్గజం టాటా గ్రూప్‌.. డిస్‌ప్లే చిప్స్‌ తయారీలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు వీలుగా టాటా గ్రూప్‌ కంపెనీ టాటా ఎల్రక్టానిక్స్‌ తైవాన్‌ సంస్థ పీఎస్‌ఎంసీ, హైమాక్స్‌ టెక్నాలజీస్‌తో చేతులు కలిపింది. అంతేకాకుండా గుజరాత్‌ ప్రభుత్వంతోనూ జత కట్టింది. తద్వారా త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వెరసి గుజరాత్‌లో తైవాన్‌ కంపెనీ భాగస్వామ్యంతో డిస్‌ప్లే చిప్స్‌ తయారీకి తెరతీయనుంది.

ఈ అంశాలను ఐఈఎస్‌ఏ విజన్‌ సదస్సులో టాటా ఎల్రక్టానిక్స్‌ సీఈవో రణదీర్‌ ఠాకూర్‌ ప్రకటించారు. టాటా ఎల్రక్టానిక్స్, పీఎస్‌ఎంసీ, హైమాక్స్‌ మధ్య అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదిరినట్లు వెల్లడించారు. పీఎస్‌ఎంసీ టెక్నాలజీ సహకారంతో గుజరాత్‌లోని ధోలెరాలో హైమాక్స్‌ కోసం డిస్‌ప్లే చిప్స్‌ తయారీని చేపట్టనున్నట్లు తెలియజేశారు.  

ఇదీ చదవండి: బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. వరుసగా నాలుగు రోజులు సెలవు

మూడు విభాగాల్లోనూ..  

డిస్‌ప్లే చిప్స్‌ను టీవీలతోపాటు, మొబైల్‌ ఫోన్‌ తెరలు, కెమెరాలలో ఇమేజ్‌ సెన్సార్లు, ఎల్‌ఈడీలు, ఓఎల్‌ఈడీలు తదితరాలలో వినియోగిస్తారు. తాజా ఒప్పందంతో టాటా ఎలక్ట్రానిక్స్‌ అన్ని(మూడు రకాల) సెమీకండక్టర్‌ తయారీ విభాగాల్లోనూ కార్యకలాపాలు విస్తరించనుంది. కంపెనీ ఇప్పటికే పీఎస్‌ఎంసీ సాంకేతిక భాగస్వామిగా గుజరాత్‌లో సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఇందుకు రూ.91,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తోంది. అస్సామ్‌లోనూ రూ.27,000 కోట్ల పెట్టుబడులతో చిప్‌ అసెంబ్లీ ప్లాంటును నెలకొల్పుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement