రిలీఫ్‌ ర్యాలీ.. 1100 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ | stock market updates on april 8 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: రిలీఫ్‌ ర్యాలీ.. 1100 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

Apr 8 2025 9:23 AM | Updated on Apr 8 2025 10:49 AM

stock market updates on april 8 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 347 పాయింట్లు పెరిగి 22,511కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 1096 పాయింట్లు ఎగబాకి 74,235 వద్ద ట్రేడవుతోంది. నిన్న భారీగా పడిన మార్కెట్‌ల్లో ఈరోజు రిలీఫ్‌ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 102.97 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 65.01 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.14 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.23 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 0.1 శాతం పుంజుకుంది.

మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ నినాదంతో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన ట్రంప్‌.. ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో సృష్టిస్తున్న ప్రకంపనలు చల్లారడం లేదు. అమెరికాతో వ్యాపారం చేస్తున్న ప్రతి దేశాన్నీ కాళ్ల బేరానికి వచ్చేలా చేయడానికి ఆయన ఎంచుకున్న ప్రతీకార సుంకాలు అమెరికా సహా అన్ని స్టాక్‌ మార్కెట్లలోనూ కల్లోలాన్ని కొనసాగిస్తున్నాయి. కెనడా, జపాన్‌ సహా పలు దేశాల అధినేతలు ట్రంప్‌తో చర్చలకు వెళుతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా చైనా మాత్రం దిగిరాలేదు. పైపెచ్చు ట్రంప్‌ టారిఫ్‌లకు జవాబుగా చైనా కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచటంతో ట్రంప్‌ బెదిరింపులకు దిగింది. చైనా వాటిని ఉపసంహరించుకోకపోతే మరో 50 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. మరోవైపు ట్రంప్‌ చర్యలతో  ప్రపంచాన్ని మాంద్యం ముంచెత్తే అవకాశాలు 60 శాతానికి చేరినట్లు ఆర్థిక దిగ్గజాలు ప్రకటించాయి.

Global Stock Markets: మార్కెట్లు క్రాష్‌!

అప్రమత్తత అవసరం

తీవ్ర అనిశ్చితులతో ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లో భయాందోళనలు భారీగా పెరిగాయి. ట్రంప్‌ సుంకాల విధింపుతో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయో ఎవరికి సరైన స్పష్టత లేదు. అయినప్పటికీ ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లపై ప్రభావం తక్కువగానే ఉంది. క్షీణత వేళ అప్రమత్తతతో వ్యహరిస్తూ మంచి షేరు విలువ ఆకర్షణీయంగా కనిపిస్తే కొనుగోలు చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్వెస్ట్‌ చేసేముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు.

  • గురువారం(10న) శ్రీ మహావీర్‌ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు.

ఇదీ చదవండి: టాయ్‌ పరిశ్రమకు ‘టారిఫ్‌’ల ప్రయోజనం!

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement