భారత స్టాక్ మార్కెట్లకు వచ్చే వారం ఒక అదనపు సెలవు రానుంది. దీంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు జూన్ 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో కేవలం నాలుగు రోజులే ట్రేడింగ్ చేసే అవకాశం ఉంటుంది. భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) శుక్రవారం అంటే జూన్ 26న మొహర్రం సందర్భంగా పూర్తిగా మూతపడనున్నాయి.
ఈ సెలవు కారణంగా ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB), ఇంటరెస్ట్ రేట్ డెరివేటివ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR) వంటి ప్రధాన విభాగాల్లో ట్రేడింగ్ జరగదు.
శుక్రవారం మొహర్రం సెలవుతో పాటు జూన్ 27, 28 తేదీల్లో శని, ఆదివారాల వారాంతపు విరామం ఉండటంతో మార్కెట్కు వరుసగా మూడు రోజుల విరామం లభించనుంది. తిరిగి జూన్ 29, సోమవారం నుంచి సాధారణ ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.
స్టాక్ మార్కెట్ సమయాలు ఇలా..
మార్కెట్ సాధారణ సమయాల ప్రకారం.. ప్రీ-ఓపెన్ సెషన్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై 9:08 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు రెగ్యులర్ ట్రేడింగ్ జరుగుతుంది. ముగింపు (క్లోజింగ్) సెషన్ 3:40 నుంచి 4 గంటల వరకు ఉంటుంది.
ఇదిలా ఉండగా, సెలవుతో కూడిన ఈ వారంలో డివిడెండ్లు, బోనస్ షేర్లు తదితర కార్పొరేట్ చర్యల కారణంగా పలు ప్రముఖ కంపెనీల షేర్లు ఎక్స్-డేట్కు వెళ్లనున్నాయి. ఇక్కడ ఎక్స్-డేట్ (Ex-Date) అంటే కంపెనీ ప్రకటించిన డివిడెండ్, బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ లేదా రైట్స్ ఇష్యూ వంటి కార్పొరేట్ బెనిఫిట్లకు అర్హత నిర్ణయించే కీలక తేదీ. అందువల్ల ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తమ పొజిషన్లు, మార్జిన్ అవసరాలు, సెటిల్మెంట్లను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నాయి.


