ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ప్రసంగంపై ఫోకస్
అమెరికా స్థూల ఆర్థిక గణాంకాలు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్రూడ్ ధరలపై కన్ను
స్వల్ప కరెక్షన్ తర్వాత పరిమిత లాభాలకు అవకాశం
ఈ వారం ట్రేడింగ్పై స్టాక్ నిపుణుల అంచనాలు
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం భారత స్టాక్ మార్కెట్ దిశను నిర్దేశించే అవకాశం ఉందని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. జాక్సన్ హోల్ సింపోజియంలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్‡్ష ప్రసంగం, ఎన్వీడియా త్రైమాసిక ఫలితాలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు ట్రేడింగ్పై ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు.
దేశీయంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం, రూపాయి కదలికలు, లిక్విడిటీ పరిస్థితులను మార్కెట్ వర్గాలు పరిశీలించే అవకాశం ఉంది. ‘‘ఇన్వెస్టర్లు రియల్టీ, మెటల్, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాల వైపు మొగ్గు చూపుతుండటం, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత మార్కెట్లలో కొనుగోళ్లు కొనసాగిస్తుండటం ఊరటనిచ్చే అంశం. రాబోయే రోజుల్లో బ్రెంట్ క్రూడ్ ధరలు 90 డాలర్ల కిందకు దిగువ వస్తే, దేశీయ ఈక్విటీ మార్కెట్లో కన్సాలిడేషన్ చోటుచేసుకునే అవకాశం ఉంది’’ అని రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ అజిత్ మిశ్రా తెలిపారు.
ఫెడరల్ రిజర్వ్ చైర్మన్పై దృష్టి
ఈ వారం జాక్సన్ హోల్ సింపోజియం ఇన్వెస్టర్లకు కీలకంగా మారనుంది. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్‡్ష ప్రసంగంపై ప్రపంచ మార్కెట్లు దృష్టి సారించనున్నాయి. సెపె్టంబర్లో జరగనున్న ఫెడ్ పాలసీ సమావేశానికి ముందు ద్రవ్యోల్బణం, ఉపాధి పరిస్థితులు, వడ్డీ రేట్ల భవిష్యత్ దిశపై ఆయన ఎలాంటి సంకేతాలిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికాలో వడ్డీ రేట్లపై అంచనాలు మారితే ప్రపంచ మార్కెట్లతో పాటు భారత ఈక్విటీలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
పశ్చిమాసియా పరిణామాలు, క్రూడ్ ధరలపై కన్ను...
పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఈ వారం కూడా మార్కెట్లకు కీలకంగా మారనున్నాయి. హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణాకు ఏర్పడిన అంతరాయం కారణంగా ముడి చమురు సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 90 డాలర్ల ఎగువన కొనసాగడం భారత మార్కెట్కు ప్రధాన ఆందోళనగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముడి చమురు ధరలు మరింత పెరిగితే దిగుమతి వ్యయం, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరిగి మార్కెట్పై ఒత్తిడి పడే అవకాశం ఉంది.
గత వారం స్వల్ప నష్టాలు
గత వారంతో స్టాక్ మార్కెట్ పరిమితి శ్రేణిలో ట్రేడవుతూ, స్వల్ప అమ్మకాల ఒత్తిడికి లోనైంది. వారాంతంలో శుక్రవారం కోలుకున్నప్పటికీ, మొత్తం వారానికి సెన్సెక్స్ 468 పాయింట్లు (0.60%), నిఫ్టీ 114 పాయింట్లు (0.46%) నష్టపోయాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచ బాండ్లపై రాబడులు పెరుగుదల గత వారం మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపాయి.
సాంకేతిక అంశాలు...
నిఫ్టీలో గత రెండు వారాలుగా కరెక్షన్ కొనసాగిన నేపథ్యంలో, స్వల్ప కాంలో మార్కెట్ కొంత స్థిరీకరణతో పాటు స్వల్పంగా కోలుకునే అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీ పరిమిత శ్రేణిలో ట్రేడవ్వొచ్చు.దిగువ స్థాయిలో 24,200 వద్ద తక్షణ మద్దతు ఉండగా, ఈ స్థాయిని కోల్పోతే 24,000 వరకు కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, 24,350 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే నిఫ్టీ 24,500 దిశగా కదిలే అవకాశం ఉందని సాంకేతిక విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా గణాంకాలూ కీలకమే
అమెరికా జీడీపీ అంచనాలు, డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్లు, వినియోగదారుల విశ్వాస సూచీతో పాటు పీసీఈ ద్రవ్యోల్బణ గణాంకాలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. ఈ గణాంకాలు అమెరికా ఆర్థిక వ్యవ స్థ స్థితిగతులపై స్పష్టత ఇవ్వడంతో పాటు, ఫెడరల్ రిజర్వ్ తదుపరి విధాన నిర్ణయాలపై మార్కెట్ అంచనాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ వారంలో ఎనీ్వడియా త్రైమాసిక ఫలితాలు కూడా అంతర్జాతీయ టెక్నాలజీ షేర్ల కదలికలకు కీలకంగా మారవచ్చు.
భారత మార్కెట్లో విదేశీ పెట్టుబడుల జోరు
ఆగస్టులో రూ.23,544 కోట్ల పెట్టుబడులు
భారత ఈక్విటీ మార్కెట్లపై విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తి మళ్లీ పెరుగుతోంది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) ఆగస్టు లో ఇప్పటివరకు (21 తేదీ వరకు) భారత ఈక్విటీల్లో రూ.23,544 కోట్ల పెట్టుబడులు పెట్టారు. కార్పొరేట్ కంపెనీలు ఆకర్షణీయమైన ఆర్థిక త్రైమాసిక ఫలితాలు ప్రకటన, రూపాయి స్థిర త్వం, మార్కెట్పై సానుకూల వృద్ధి అంచనాలు ఇందుకు కారణమయ్యాయి.
జూలైలో రూ.20,200 కోట్ల పెట్టుబడుల తర్వాత వరుసగా రెండో నెల కూడా విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండటం విశేషం. ‘‘కార్పొరేట్ లాభాల వృద్ధి పుంజుకోవడం, క్యూ1 ఫలితాల్లో కనిపించిన మెరుగుదల, ఇతర అంతర్జాతీయ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల మళ్లింపు, రూపా యి స్థిరత్వం తదితర అంశాలు ఎఫ్పీఐలను మళ్లీ భారత మార్కెట్ వైపు ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఎఫ్పీలులు ఆకర్షణీయమైన వ్యాల్యుయేషన్లలో లభిస్తున్న బ్యాంకింగ్, ఐటీ దిగ్గజాల షేర్లను కొనుగోలు చేయడం లేదు.
అధిక వ్యాల్యుయేషన్లు ఉన్నప్పటికీ ఎంపిక చేసిన మిడ్క్యాప్ స్టాక్స్పైనే దృష్టి సారిస్తున్నారు’’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీ.కే. విజయకుమార్ తెలిపారు. ఈక్విటీలతో పాటు డెట్ (రుణ) మార్కెట్పైనా విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. సమీక్షించిన కాలంలో ‘ఎఫ్ఏఆర్’ మార్గంలో రూ.852 కోట్ల పెట్టుబడులు రాగా, సాధారణ పద్ధతిలో రూ.995 కోట్లు కోట్ల నిధులు వెనక్కి వెళ్లినట్లు సీడీఎస్ఎల్ గణాంకాలు వెల్లడించాయి.


