
కేజీ ధర రూ. 1,04,100
సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: దేశీయంగా వెండి గురువారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం వరుసగా నాలుగో రోజు పరుగును కొనసాగిస్తూ న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి కేజీ ధర మరో రూ. 2,000 పెరిగి రూ. 1,04,100 (పన్నులు కలిపి) పలికింది. చివరిసారిగా మార్చి 19న వెండి రేటు ఆల్ టైమ్ గరిష్టమైన రూ. 1,03,500 స్థాయిని తాకింది.
పటిష్టమైన ఫండమెంటల్స్, పరిశ్రమల నుంచి డిమాండ్, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా ఉపయోగిస్తుండటం, అంతర్జాతీయంగా సరఫరా నెమ్మదించడం తదితర అంశాల కారణంగా దేశీ మార్కెట్లో వెండి రేటు సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. అటు మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్లో సిల్వర్ ఫ్యూచర్స్ జూలై కాంట్రాక్టు ధర ఒక దశలో సుమారు రూ. 3,833 పెరిగి రూ. 1,05,213 వద్ద ట్రేడయ్యింది.
పసిడి పరుగు..
డాలరు బలహీనత, అమెరికా రుణభారంపై ఆందోళనలు, అనిశ్చితిలో సురక్షితమైన సాధనంగా పసిడికి పేరుండటం వంటి అంశాల కారణంగా బంగారం ధర కూడా పరుగు తీస్తోంది. 99.9 శాతం స్వచ్ఛత గల పుత్తడి రేటు 10 గ్రాములకు రూ. 430 పెరిగి రూ. 99,690 వద్ద (పన్నులు కలిపి) ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం రూ. 400 పెరిగి రూ. 99,100 వద్ద క్లోజయ్యింది. అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్సుకు (31.1 గ్రాములు) 3,395 డాలర్ల పైకి చేరగా, దేశీయంగా ఎంసీఎక్స్లో రూ. 98,450 వద్ద ట్రేడయినట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు.
దీపావళి నాటికి
దీపావళి నాటికి వెండి ధర రూ. 1,14,000 – రూ. 1,20,000 స్థాయికి చేరే అవకాశం ఉందని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా అనిశ్చితుల కారణంగా ఈలోపు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని పేర్కొన్నారు. మరోవైపు, కొత్తగా భౌగోళిక రాజకీయ పరిణామాలేమైనా తలెత్తితే మరింత అనిశ్చితికి ఆజ్యం పోసినట్లవుతుందని, దీంతో ఇన్వెస్టర్లు మళ్లీ బంగారంవైపు మొగ్గు చూపవచ్చని అబాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సీఈవో చింతన్ మెహతా చెప్పారు.