
రెండో రోజూ ముందుకే...
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్లో భాగంగా స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 70 పాయింట్లు పెరిగి 80,288 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఏడు పాయింట్ల నామమాత్ర లాభంతో 24,336 వద్ద నిలిచింది. వరుసగా రెండో రోజూ లాభాల్లో నిలిచాయి. భారత్–పాక్ల మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రికత్త పరిస్థితుల దృష్ట్యా ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. సెన్సెక్స్ 443 పాయింట్లు ఎగసి 80,661 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 24,458 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి.
ఐటీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్, కన్జూమర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్, యుటిలిటీ, టెలీకమ్యూనికేషన్, సర్విసెస్, బ్యాంకులు, ఫైనాన్స్ సర్విసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 27 పైసలు బలపడి 84.96 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
మెరుగైన ఫలితాలతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 4% పెరిగి రూ.1,031 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 10% ఎగసి రూ.1,085 తాకింది రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2%, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు ఒకశాతం చొప్పున రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి.