
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల తగ్గించింది. దీనికి అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లతో సహా ప్రధాన బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లోని బ్యాలెన్స్పై చెల్లించే వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో పొదుపు ఖాతాదారులు తక్కువ రాబడిని చూస్తారు. ఈ ఏడాది క్యుములేటివ్ రేటు కోత ఇప్పుడు 1 శాతంగా ఉంది. పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒకే విధమైన తక్కువ రేట్ల విధానానికి మారడంతో డిపాజిటర్లపై ప్రభావం పడుతోంది.
వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ తన పొదుపు ఖాతా వడ్డీ రేటును జూన్ 15 నుండి అన్ని బ్యాలెన్స్లకు సంవత్సరానికి 2.5 శాతానికి సవరించింది. గతంలో రూ.10 కోట్ల లోపు బ్యాలెన్స్లపై 2.7 శాతం, రూ.10 కోట్లు అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్లపై 3 శాతం వడ్డీని ఆఫర్ చేసేది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన పొదుపు రేట్లను జూన్ 10 నుండి ఫ్లాట్ 2.75 శాతానికి సర్దుబాటు చేసింది. గతంలో ఇది రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్లపై 2.75 శాతం, రూ.50 లక్షలు అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్లపై 3.25 శాతం వడ్డీని ఆఫర్ చేసింది.
ఐసీఐసీఐ బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తన వడ్డీ రేటును 2.75 శాతానికి సవరించింది. ఇది జూన్ 12 నుండి వర్తిస్తుంది. గతంలో ఇది రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్లపై 2.75 శాతం, అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్లపై 3.25 శాతం వడ్డీని అందించేది.
రాబడి పెంచుకోండి..
యువత బ్యాంక్ బ్యాలెన్స్పైనే దృష్టి పెట్టకుండా దాన్ని రాబడినిచ్చే పెట్టుబడి మార్గాల వైపు మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. పొదుపు ఖాతా మీ డబ్బును సురక్షితంగా ఉంచుతుంది. కానీ ద్రవ్యోల్బణం నెమ్మదిగా దాని విలువను తినేస్తుంది. మరోవైపు, పెట్టుబడి మీ డబ్బును కాంపౌండింగ్ శక్తి ద్వారా కాలక్రమేణా పెంచుతుంది. ఎక్కువ వడ్డీనిచ్చే పొదుపు పథకాలు, మ్యూచువల్ ఫండ్స్, సిప్ లు లేదా స్టాక్స్ లోని ఫ్రాక్షనల్ షేర్లతో చిన్నగా ప్రారంభించవచ్చు. పెట్టుబడి పెట్టడానికి మీరు ధనవంతులు కానవసరం లేదు. మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే, మీ ఆర్థిక పునాది బలంగా మారుతుంది.