ఐటీ, అధిక వెయిటేజీ షేర్లకు డిమాండ్
ఒక శాతానికి పైగా పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ
స్టాక్ సూచీలకు రెండో రోజూ లాభాలు
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ వారాంతపు రోజున ఒక శాతానికి పైగా లాభాలు మూటగట్టుకున్నాయి. కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక (క్యూ1)ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు కలిసొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడం, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి స్థిరమైన ప్రదర్శన వంటి అంశాలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపాయి.
ఈ పరిణామాలతో ఐటీ రంగ షేర్లతో పాటు అధిక వెయిటేజీ ఉన్న షేర్లకు భారీగా డిమాండ్ లభించింది. ఫలితంగా, శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 828 పాయింట్లు పెరిగి 77,569 వద్ద ముగిసింది. నిఫ్టీ 244 పాయింట్లు బలపడి 24,207 వద్ద స్థిరపడింది. సూచీలు ఒక శాతానికి పైగా ర్యాలీ చేయడంతో ఒక్కరోజే రూ.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద సృష్టి జరిగింది. దీంతో బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.482 లక్షల కోట్లకు చేరింది.
టీసీఎస్ దన్నుతో మెరిసిన ఐటీ షేర్లు
అంచనాలకు తగ్గట్లు తొలి క్వార్టర్ ఆర్థిక ఫలితాల ప్రకటనతో టీసీఎస్ షేరు 1% పెరిగి రూ.2,069 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 4.1% ర్యాలీతో రూ.2,132 వద్ద గరిష్టాన్ని తాకింది. డిమాండ్ క్యూ2లో పుంజుకునే అవకాశం ఉందంటూ టీసీఎస్ యాజమాన్యం అంచనా వేయడం ఐటీ రంగానికి బూస్టిచ్చింది. దీంతో ఎల్టీఎం 5%, పెర్సిస్టెంట్ 4.46%, ఎంఫసీస్ 2.63%, కేపీఐటీటెక్ 2.56%, కోఫోర్జ్ 2.37% లాభపడ్డాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ (2.3%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.8%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.5%) పెరిగాయి.


