గత ఐదు రోజులు వరుస లాభాలతో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లకు శుక్రవారం ఒక్కసారిగా బ్రేక్ పడింది. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 23,950 స్థాయి కంటే దిగువకు చేరుకుంది. ఈ పతనంతో కేవలం రెండు గంటల్లోనే అన్ని బీఎస్ఈ సెన్సెక్స్ కంపెనీల మొత్తం విలువ సుమారు రూ. 1.3 లక్షల కోట్లు తగ్గింది.
స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవడానికి ఐటీ షేర్ల అమ్మకాలు, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు, లాభాల స్వీకరణ, ప్రపంచ మార్కెట్ల బలహీనత, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి అనేక అంశాలు కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఐటీ రంగం
మార్కెట్ పతనానికి ప్రధాన కారణం ఐటీ రంగం అని తెలుస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్ తన 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంపై ఆందోళనలు పెరిగాయి.
దీంతో భారత ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎంఫసిస్ వంటి దిగ్గజ షేర్లు 5 నుంచి 8 శాతం మధ్య పడిపోయాయి. భారత ఐటీ కంపెనీల ఆదాయంలో పెద్ద భాగం ఉత్తర అమెరికా మార్కెట్ నుంచే వస్తుంది. కాబట్టి అక్కడ టెక్నాలజీ ఖర్చులు తగ్గే అవకాశం ఉందనే భయం.. పెట్టుబడిదారులను అమ్మకాల వైపు మళ్లించింది.
విదేశీ పెట్టుబడిదారులు
ఇటీవల మూడు రోజుల పాటు కొనుగోళ్లు చేసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ అమ్మకాల వైపు మొగ్గు చూపారు. గురువారం ఒక్కరోజే వారు సుమారు రూ.1,025 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇది మార్కెట్లో ఆందోళనను పెంచింది. ఎందుకంటే విదేశీ పెట్టుబడిదారులు మార్కెట్ దిశను ప్రభావితం చేసే ముఖ్యమైన వర్గం. వారు అమ్మకాలు పెంచితే మార్కెట్పై ఒత్తిడి పెరుగుతుంది.
లాభాల స్వీకరణ
స్టాక్ మార్కెట్లు ఎప్పుడూ ఒకే దిశలో కదలవు. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 5% పెరిగింది. నిఫ్టీ 4% కంటే ఎక్కువ లాభపడింది. ఇంత వేగంగా మార్కెట్ పెరిగిన తర్వాత కొంతమంది పెట్టుబడిదారులు తమ లాభాలను బుక్ చేసుకోవడం సహజం. దీనినే లాభాల స్వీకరణ (Profit Booking) అంటారు. ఈ అమ్మకాలు మొదట చిన్న స్థాయిలో ప్రారంభమైనా, తరువాత మరింత విస్తరించి మొత్తం మార్కెట్పై ప్రభావం చూపాయి.
ప్రపంచ మార్కెట్లు
భారత మార్కెట్కు ప్రపంచ మార్కెట్ల పరిస్థితి కూడా చాలా ముఖ్యమైనది. ఆసియా మార్కెట్లు భారీగా పడిపోయాయి, దక్షిణ కొరియా కోస్పి, హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ సూచీలు దాదాపు 2 శాతం చొప్పున పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల భారత మార్కెట్కు సానుకూల సంకేతాలు లభించలేదు. దీంతో ఇప్పటికే బలహీనంగా ఉన్న మార్కెట్ మరింత ఒత్తిడికి గురైంది.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు
ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ, మధ్యప్రాచ్యంలో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. దక్షిణ లెబనాన్లో కొత్త దాడుల వార్తలు, ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు మళ్లీ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. భారతదేశానికి ముఖ్యంగా ముడి చమురు (Crude Oil) ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది.
స్టాక్ మార్కెట్ పతనం అనేది సర్వ సాధారణమే అని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మార్కెట్ మళ్లీ కోలుకునే అవకాశం ఉంది. కానీ పెట్టుబడిదారులు రాబోయే రోజుల్లో ప్రపంచ పరిస్థితులు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, చమురు ధరల కదలికలను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుందని చెబుతున్నారు.


