
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక బ్యాంకుల బ్యాంకింగ్ లైసెన్సులను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి గల కారణం ఏంటి? దీనికి సంబంధించిన ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. మహారాష్ట్ర బుల్ధానా కేంద్రంగా ఉన్న మల్కాపుర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (Malkapur Urban Co-operative Bank Ltd), బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న 'శుష్రుతి సౌహార్ద సహకార బ్యాంక్' (Shushruti Souharda Sahakara Bank) లైసెన్సులను ఆర్బీఐ రద్దు చేసింది. గత బుధవారం రోజు బ్యాంకింగ్ లావాదేవీలు జరగకుండా సీజ్ చేసింది.
రెండు బ్యాంకుల వద్ద ప్రస్తుతం సరైన మూలధనం లేదని.. భవిష్యత్తులో లాభాలు కూడా వచ్చే సూచనలు లేవని లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అంతే కాకుండా డిపాజిటర్లకు కూడా పూర్తిగా డబ్బు చెల్లించే స్థితిలో లేనట్లు ఆర్బీఐ నిర్దారించింది. లైసెన్స్ క్యాన్సిల్ అయినప్పటికీ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) కింద రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అమౌంట్ క్లైమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
(ఇదీ చదవండి: అగ్ర రాజ్యంలో వైన్ బిజినెస్ - కోట్లు సంపాదిస్తున్న భారతీయ మహిళ)
డిఐసీజీసీ ప్రకారం మల్కాపుర్ సహకార బ్యాంక్ 97.60 శాతం మంది డిపాజిటర్లు తిరిగి వారి అమౌంట్ పొందటానికి అర్హులని తెలుస్తోంది. అదే సమయంలో కర్ణాటక శుష్రుతి సౌహార్ద సహకార బ్యాంక్లో 91.92 శాతం మంది డిపాజిటర్లు అర్హులుగా తెలుస్తోంది. డిపాజిటర్లు దీనిని తప్పకుండా గమనించాలి.