
మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్సీ భార్గవ
ప్రస్తుతానికి తమ వాహనాల ఉత్పత్తిపై రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కొరత ప్రభావమేమీ లేదని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ఉత్పత్తి కార్యకలాపాలన్నీ ప్రణాళికలకు అనుగుణంగా యథాప్రకారమే కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లను దిగుమతి చేసుకునేందుకు చైనా ప్రభుత్వం లైసెన్సులు ఇస్తే రాబోయే నెలల్లో కూడా తయారీకి ఎలాంటి సమస్య ఉండబోదని వివరించారు.
ఇదీ చదవండి: భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా అంబానీ ఆధ్వర్యంలో వేడుకలు
పరిశ్రమ వర్గాల ప్రకారం పలు దేశీ సరఫరా సంస్థలు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల దిగుమతికి చైనా ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు రాకపోవడంతో ఈ విషయంలో సాయం అందించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. వాహనాలు, గృహోపకరణాలు మొదలైన వాటిల్లో ఉపయోగించే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ప్రాసెసింగ్లో అంతర్జాతీయంగా చైనాకు 90 శాతం వాటా ఉంది. వీటిని ఎగుమతి చేయడంపై ఏప్రిల్ 4 నుంచి చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఏడు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్తో పాటు వాటికి సంబంధించిన మ్యాగ్నెట్ల ఎగుమతి కోసం ప్రత్యేక లైసైన్సు తీసుకోవాలని నిర్దేశించింది.