వృద్ధి జోరులో మనమే టాప్‌! | RBI balance sheet for FY25 expands by 8. 2percent to Rs 76. 25 lakh crore | Sakshi
Sakshi News home page

వృద్ధి జోరులో మనమే టాప్‌!

May 30 2025 12:24 AM | Updated on May 30 2025 8:21 AM

RBI balance sheet for FY25 expands by 8. 2percent to Rs 76. 25 lakh crore

పటిష్టంగా స్థూల ఆర్థిక మూలాలు 

సవాళ్లు ఉన్నా 2024–25లో బలమైన పనితీరు 

రూ.76.25 లక్షల కోట్లకు బ్యాలన్స్‌ షీటు 

మెరుగైన వృద్ధితోనే రూ.2.7 లక్షల కోట్ల డివిడెండ్‌ 

ఆర్‌బీఐ వార్షిక నివేదికలో వెల్లడి

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2025–26) భారత్‌ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. స్థూల ఆర్థిక బలాలకుతోడు ఆర్థిక రంగం పటిష్టంగా ఉండడం, స్థిరమైన వృద్ధి పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అంకిత భావం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. బ్యాంకింగ్‌ రంగంలో రిస్క్‌లు, బలహీనతలను ముందస్తుగా గుర్తించేందుకు ఆర్‌బీఐ పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది. ఈ మేరకు తన వార్షిక నివేదికను ఆర్‌బీఐ విడుదల చేసింది.

ఎన్నో సవాళ్లు.. అయినా సానుకూలతలు 

బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడడం, నిధుల లభ్యత తగినంత ఉండడం ఆర్థిక రంగం పటిష్టతను సూచిస్తున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఇది ఆర్థిక కార్యకలాపాలకు మద్దతునిస్తుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా ఎన్నో సమస్యలు నెలకొన్నప్పటికీ భారత ఫైనాన్షియల్‌ మార్కెట్లు బలంగా నిలబడినట్టు గుర్తు చేసింది.  అంతర్జాతీయంగా ఫైనాన్షియల్‌ మార్కెట్లలో అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్యంలో సమస్యలు, సరఫరా వ్యవస్థలో అవాంతరాలు, వాతావరణ ఆధారిత అనిశ్చితులు దేశ వృద్ధి అంచనాలను దిగువ వైపునకు తీసుకెళ్లే రిస్క్ లను ఆర్‌బీఐ తన నివేదికలో ప్రస్తావించింది. 

సరఫరా వ్యవస్థలో ఒత్తిళ్లు తగ్గుముఖం పడుతుండడంతోపాటు, అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు శాంతించడం, వ్యవసాయ ఉత్పత్తి పెరగడం, నైరుతిలో సాధారణం కంటే అధిక వర్షపాతం అంచనాలు ద్రవ్యోల్బణాన్ని అదుపులోనే ఉంచడానికి సాయపడే అంశాలుగా పేర్కొంది. వాణిజ్య విధానాల్లో ఊహించని మలుపులు ఫైనాన్షియల్‌ మార్కెట్లలో అనిశ్చితులకు దారితీయవచ్చని.. ఎగుమతులకు సమస్యలు ఎదురుకావొచ్చని అంచనా వేసింది. అదే సమయంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కోసం భారత్‌ చర్చలు నిర్వహిస్తుండడం ఈ ప్రభావాలను పరిమితం చేయొచ్చని పేర్కొంది. 

మెరుగైన రిస్క్‌ నిర్వహణ: దేశ బ్యాంకింగ్‌ రంగం బలంగా ఉందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు, ఈ దిశగా సేవల నాణ్యతను పెంచేందుకు ‘ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మన్‌ స్కీమ్, 2021’ను ఈ ఆర్థిక సంవత్సరంలో సమీక్షించనున్నట్టు తెలిపింది.   

బ్యాలన్స్‌ షీటు 8 శాతం వృద్ధి 
ఆర్‌బీఐ బ్యాలన్స్‌ షీటు గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 8.20 శాతం (5.77 లక్షల కోట్లు) పెరిగి రూ.76.25 లక్షల కోట్లకు చేరుకుంది. 2024 మార్చి నాటికి ఇది రూ.70.47 లక్షల కోట్లుగా ఉంది. మిగులు నిల్వలు 27 శాతం అధికమై రూ.2,68,590 కోట్లకు చేరాయి. విదేశీ మారకం లావాదేవీలపై ఆదాయం 33 శాతం పెరిగి రూ.1.11 లక్షల కోట్లకు చేరింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.2.7 లక్షల కోట్ల భారీ డివిడెండ్‌ను ప్రకటించినట్టు ఈ నివేదిక తెలిపింది.

బంగారం ఆస్తులు 57 శాతం జంప్‌ 
ఆర్‌బీఐ నిర్వహణలోని బంగారం ఆస్తుల విలువ గత ఆర్థిక సంవత్సరంలో 57 శాతం జంప్‌ చేసి రూ.4.32 లక్షల కోట్లకు చేరుకుంది. 2024 మార్చి నాటికి ఈ మొత్తం రూ.2.74 లక్షల కోట్లుగానే ఉండడం గమనార్హం. పరిమాణం పరంగా చూస్తే 2024 మార్చి నాటికి 822 టన్నుల బంగారం ఉంటే, ఈ ఏడాది మార్చి నాటికి 879.58 టన్నులకు పెరిగింది.

కరెన్సీ నోట్లతో పార్టీకల్‌ బోర్డులు  
కరెన్సీ నోట్లను నిరీ్వర్యం చేసే విషయమై ఆర్‌బీఐ పర్యావరణ అనుకూల నిర్ణయం తీసుకుంది. ముక్కలైన నోట్లు, కాలం చెల్లిన నోట్లతో పార్టికల్‌ బోర్డులు తయారు చేయనున్నట్టు ప్రకటించింది. తయారీదారులను నియమించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. కాగా, రూ.10, 20, 50, 100, 2000 నకిలీ నోట్లను ఆర్‌బీఐ గుర్తించింది. రూ.200, 500 డినామినేషన్‌ నకిలీ నోట్ల విలువ వరుసగా 13.9 శాతం, 37.3 శాతం చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో పెరిగాయి.

మూడు రెట్లు పెరిగిన మోసాలు
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మోసాల విలువ మూడు రెట్లు పెరిగినట్టు ఆర్‌బీఐ నివేదిక తెలియజేసింది. రుణ ఖాతాలు, డిజిటల్‌ చెల్లింపులు తదితర మోసాల విలువ రూ.36,014 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. అంతకుముందు సంవత్సరంలో ఈ మొత్తం రూ.12,330 కోట్లుగానే ఉంది. మోసాల కేసుల సంఖ్య మాత్రం 23,953 నుంచి 36,060కు తగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి 122 మోసం కేసులను (రూ.18,674 కోట్ల మొత్తం) పునఃపరిశీలన తర్వాత మళ్లీ రిపోర్ట్‌ చేయడం వల్లే మోసాల విలువ గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగినట్టు ఆర్‌బీఐ తెలిపింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement