
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బహిరంగ వేలం ద్వారా చేపట్టిన ఓపెన్ ప్లాట్ల విక్రయాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. గత రెండు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మంగళవారం మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్ పల్లి ప్రాంతంలోని 68 ప్లాట్లకు సంబంధించిన బహిరంగ వేలం ప్రక్రియ చేపట్టారు.
వేలం నిర్వహించిన 50 ప్లాట్ల విక్రయానికి సంబంధించి దాదాపు రూ.100 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డుకు (Outer Ring Road) అతి సమీపంలోని ఈ భూములను కొనుగోలు చేయడానికి సుమారు 119 మంది బిడ్డర్లు పాల్గొన్నారు.
200– 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లలో, కార్నర్ ప్లాట్కు రూ 30 వేలు, ఇతర ప్లాట్లకు రూ.27 వేలు ఆఫ్ సెట్ ధరగా నిర్ణయించారు. ఒక్కో ప్లాట్ కోసం దాదాపు 30 మంది వరకు పోటీ పడ్డారు. కార్నర్ ప్లాట్లకు మంచి డిమాండ్ రేటు పలికింది. రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన 50 ప్లాట్లకు సంబంధించిన వేలంలో గరిష్టంగా చదరపు గజానికి రూ. 46,500 ధర పలికింది.
చదవండి: ఇల్లు కొనడానికి ఇదే శుభ తరుణం