
ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే అధికంగా నమోదు కావచ్చంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వేసిన అంచనాలు వ్యవసాయ రంగానికి సానుకూలమని.. ఉత్పాదకత పెరుగుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) పేర్కొంది. దీనికితోడు వడ్డీ రేట్ల తగ్గింపు వినియోగానికి ఊతమిస్తాయని.. ప్రతీకార సుంకాలతో పడే ప్రభావాన్ని ఎదుర్కొని భారత్ బలంగా నిలబడగలదని అంచనా వేసింది. ఐఎండీ అంచనాలు కేవలం రైతులకే కాకుండా, ఆర్థిక వ్యవస్థకూ అనుకూలమేనని తెలిపింది. అయితే మొత్తం మీద వర్షపాతం ఎలా ఉంటుందన్న దానిపైనే ఈ ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది.
వాతావరణ మార్పులతో వర్షాల పరంగా ఎలాంటి ఊహించని షాక్లు లేకుండా సాధారణంగా ఉంటే మరో ఏడాది వ్యవసాయ రంగం స్థూల విలువ జోడింపు (జీవీఏ) 4 శాతం స్థాయిలో ఉంటుందని ఇండ్-రా అంచనా వేసింది. ‘2024 ఖరీఫ్, రబీ పరంగా మంచి సాగును చూశాం. 2025–26లోనూ రెండు సానుకూల పంట సీజన్లు, ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్షిత స్థాయికి దిగువన ఉండడం, ద్రవ్య పరపతి విధాన సరళీకరణ అన్నవి ప్రతీకార సుంకాల ప్రభావాన్ని భారత్ తట్టుకుని నిలిచేలా చేస్తాయి’ అని ఇండ్–రా ప్రతినిధి దేవేంద్ర కుమార్ పంత్ తెలిపారు. ఈ ఏడాది జూన్–సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాలు భౌగోళికంగా వివిధ ప్రాంతాల్లో ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంటుందని ఇండ్–రా తెలిపింది.
ఇదీ చదవండి: భారత్–అమెరికా మధ్య డీల్..?
ఉపాధి కల్పనలో కీలక పాత్ర
2022–12 నాటికి జీడీపీ జీవీఏలో సాగు రంగం వాటా 18.5 శాతం ఉంటే, 2024–25లో 14.5 శాతానికి తగ్గినట్టు ఇండ్–రా తన నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ దేశ ఆరి్థక వ్యవస్థలో ఉపాధి కల్పన పరంగా కీలక భూమిక పోషిస్తున్నట్టు తెలిపింది. సాగు రంగం నుంచి ఉపాధి కల్పన వాటా 2018 మార్చి నాటికి 44.1 శాతంగా ఉంటే, 2025 మార్చి నాటికి 46.1 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. ఇది వినియోగ డిమాండ్పై, ముఖ్యంగా గ్రామీణ డిమాండ్పై ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపింది.