PLI scheme disbursement will be about Rs 13,000 crore in FY24 - Sakshi
Sakshi News home page

రూ.13,000 కోట్ల పీఎల్‌ఐ ప్రోత్సాహకాలు: 4 లక్షల ఉద్యోగాలు

Published Sat, Aug 12 2023 11:25 AM

PLI scheme disbursement will be about rs 13000 crore in FY24 DPIIT Secretary - Sakshi

న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం కింద అర్హత కలిగిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ.13,000 కోట్లను మంజూరు చేయనుంది. ఇక మీదట పీఎల్‌ఐ కింద ఏటా ఇచ్చే ప్రోత్సాహకాల మొత్తం గణనీయంగా ఉంటుందని పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఈ ఏడాది ఇలా విడుదల చేసే మొత్తం రూ.13వేల కోట్లుగా ఉండొచ్చన్నారు. పీఎల్‌ఐ కింద కేంద్ర సర్కారు 14 రంగాలకు ప్రోత్సహకాలను ఇప్పటి వరకు ప్రకటించగా, మరిన్ని రంగాలు సైతం ప్రోత్సాహకాల కోసం డిమాండ్‌ చేస్తున్నాయి.(గోల్డ్‌ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!)

టెలీకమ్యూనికేషన్స్, వైట్‌ గూడ్స్, టెక్స్‌టైల్స్, వైద్య ఉపకరణాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఫుడ్‌ ఉత్పత్తులు, అధిక సామర్థ్యం కలిగిన సోలార్‌ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ బ్యాటరీ, డ్రోన్లు, ఫార్మా రంగాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయితే వీటిల్లో సోలార్‌ పీవీ మాడ్యూళ్లు, అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ (ఏసీసీ) బ్యాటరీలు, టెక్స్‌టైల్‌ ఉత్పత్తులు, స్పెషాలిటీ స్టీల్‌ రంగాలకు పీఎల్‌ఐ కింద ప్రోత్సాహకాల విడుదల మొదలు కావాల్సి ఉంది. దేశీయ తయారీని పెంచడం, దిగుమతులు తగ్గించడం, అంతర్జాతీయంగా ఎగుమతుల్లో పోటీ పడడం అనే లక్ష్యాలతో కేంద్ర సర్కారు 2021లో పీఎల్‌ఐ పథకాన్ని తీసుకురావడం గమనార్హం.   (Fraud Alert: కస్టమ్స్‌ డ్యూటీ, వారికి బలైపోకండి!)

4 లక్షల మందికి ఉపాధి.. 
పర్యావరణ అనుమతుల్లో జాప్యం, చైనా నుంచి నిపుణుల సాయం పొందేందుకు వీసా మంజూరులో సమస్యలను భాగస్వాములు ప్రస్తావించారని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు రాజేష్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. పీఎల్‌ఐ కింద ఇప్పటికే రూ.78వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రూ.6 లక్షల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయని వెల్లడించారు. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చినట్టు తెలిపారు. ఆటబొమ్మలు, ఇతర రంగాలకు పీఎల్‌ఐ అభ్యర్థనలు అంతర్గత మంత్రిత్వ శాఖల పరిశీలనలో ఉన్నట్టు సింగ్‌ పేర్కొన్నారు.

ఇటీవలే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు అమలు చేయగా, తర్వాత అక్టోబర్‌ 31 వరకు వాయిదా వేయడం తెలిసిందే. దీనిపై సింగ్‌ మాట్లాడుతూ.. ఇది స్వేచ్ఛాయుత లైసెన్సింగ్‌ విధానమని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. దీని పట్ల పెద్దగా ఆందోళన అవసరం లేదన్నారు.

Advertisement
Advertisement