
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు పాలసీబజార్ మాతృసంస్థ పీబీ ఫిన్టెక్ కట్టుబడి ఉందని తెలిపింది. ఇందులో భాగంగా ప్రత్యేక నియామక కార్యక్రమాన్ని ప్రకటించింది. సామాజిక బాధ్యత పట్ల సంస్థ నిబద్ధతను తెలియజేస్తూ, బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు వారి పిల్లల చదువులకు సాయం చేయనుందని చెప్పింది.
దేశంలోని పీబీ ఫిన్టెక్ కార్యాలయాల్లో ఈమేరకు అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ కష్ట కాలంలో ఆయా కుటుంబాలకు దీర్ఘకాలిక సాయాన్ని అందించేందుకు సంస్థ నిబద్ధతతో ఉందని తెలిపింది. ఈ సందర్భంగా కంపెనీ సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అలోక్ బన్సాల్ మాట్లాడుతూ.. ‘కంపెనీ అందిస్తున్న సాయం కేవలం పౌరులకే కాకుండా దాడిలో ప్రభావితమైన పోలీసు సిబ్బంది, పారామిలటరీ దళాలు, సాయుధ దళాల కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. వారి అపారమైన త్యాగాలను గుర్తించి, ఈ కుటుంబాలకు సామాజిక భద్రతను కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
‘భాదిత కుటుంబాలకు కుచ్తో కర్నా హై(ఏదో ఒకటి చేయాలి) అనే భావనతో ఈ సాయం చేయాలని భావిస్తున్నాం. ఆ కుటుంబాలు కోల్పోయిన తమ ఆత్మీయులను తిరిగి తీసుకురాలేము. కానీ వారి బాధను కొంతైనా పంచుకునే అవకాశం ఉంది. మనం ఇప్పుడు వారికి సాయం చేయకపోతే ఎవరూ ముందుకురారు. బాధితులు ఎప్పటికీ ఒంటరికాదు. మేమంతా ఉన్నాం’ అని వారిలో ధైర్యం నింపారు.