వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావా | passenger filed a 1.5 million usd lawsuit against JetBlue | Sakshi
Sakshi News home page

వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావా

Jul 16 2024 8:41 AM | Updated on Jul 16 2024 9:41 AM

passenger filed a 1.5 million usd lawsuit against JetBlue

విమానంలో వేడి టీ సర్వ్‌ చేస్తున్నపుడు కుదుపులకు గురవడంతో ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో సదరు విమాన సంస్థపై ప్యాసింజర్‌ ఏకంగా 1.5 మిలియన్‌ డాలర్లు (రూ.12.5 కోట్లు) దావా వేశారు.

ప్రయాణికురాలు ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం..తహజానా లూయిస్ అనే మహిళా ప్యాసింజర్‌ తన కుటుంబంతో మే 15న ఓర్లాండో నుంచి కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌కు ‘జెట్‌బ్లూ ఫ్లైట్ 2237’ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఫ్లైట్‌ టేకాఫ్‌ అయిన కాసేపటికి సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలనే సిగ్నల్‌ వచ్చింది. అదేమీ పట్టించుకోకుండా విమాన సిబ్బంది వేడి టీ సర్వ్‌ చేయడానికి సిద్ధం అయ్యారు. కానీ అప్పటికే సీట్‌బెల్ట్‌ వార్నింగ్‌ రావడంతో విమానం కుదుపులకు గురైంది. దాంతో వేడి టీ ప్రయాణికురాలి శరీరంపై పడి ఛాతీ, కాళ్లు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమయంలో కనీసం విమాన సిబ్బంది ప్రథమ చికిత్స కూడా చేయలేదు.

ప్రయాణికురాలు గాయాల నుంచి కోలుకున్నాక ఇటీవల విమాన ఘటనపై కోర్టును ఆశ్రయించారు. యూఎస్‌ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఈమేరకు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు సంస్థ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర గాయాలపాలయ్యానని తెలియజేస్తూ 1.5 మిలియన్‌ డాలర్లు(రూ.12.5 కోట్లు) దావా వేశారు. దీనిపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. నిబంధనల ప్రకారం విమానంలో సీట్‌బెల్ట్ సిగ్నల్‌ వచ్చినపుడు వేడి పానీయాలు, భోజన సేవలను నిలిపేయాలి.

ఇదీ చదవండి: జీతం ఇవ్వలేదని సీఈఓ కిడ్నాప్‌.. 8 మంది అరెస్టు

ఇదిలాఉండగా, మే నెలలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర కుదుపులకు గురవడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దాంతో ఒక ప్యాసింజర్‌ గుండెపోటుతో మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement