ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే.. | out of 2781 Billionaires 934 individuals inherited their fortunes to next generations | Sakshi
Sakshi News home page

ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..

May 6 2024 1:22 PM | Updated on May 6 2024 3:06 PM

out of 2781 Billionaires 934 individuals inherited their fortunes to next generations

సంపన్నులైన వ్యాపార దిగ్గజాలు వారి బిజినెస్‌ కార్యకలాపాలను తమ వారసులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే ఆసియాలోనే కుబేరుడైన ముఖేశ్‌ అంబానీ తన వారసులకు వ్యాపారాలను అప్పగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారస్థులు తమ తర్వాత తరాన్ని పరిచయం చేస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫోర్బ్స్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్స్ ర్యాంకింగ్‌ 2024లో ఉన్న 2,781 మందిలో దాదాపు మూడింట ఒకవంతు మంది అంటే మొత్తం 934 మంది తమ వారసులకు వ్యాపారాన్ని అప్పగించారు. వీరు నడిపిస్తున్న కంపెనీలు, వాటి మార్కెటింగ్‌ విలువ ఏకంగా 5 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్లుగా ఉంది.

ముఖేశ్‌ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్‌ అంబానీ సంపద దాదాపు 113.5 బిలియన్ అమెరికన్‌ డాలర్లు. రిలయన్స్ టెలికాం విభాగం జియో ఇన్ఫోకామ్‌కు తన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ సారథ్యం వహిస్తున్నారు. కూతురు ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు అనంత్ అంబానీ పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.

బెర్నార్డ్ ఆర్నాల్ట్

ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు డెల్ఫిన్ ఆర్నాల్ట్, ఆంటోయిన్ ఆర్నాల్ట్, జీన్ ఆర్నాల్ట్, ఫ్రెడెరిక్ ఆర్నాల్ట్, అలెగ్జాండర్ ఆర్నాల్ట్ అనే వారసులున్నారు. తన కుటుంబ సంపద మొత్తం 214.1 బిలియన్ అమెరికన్‌ డాలర్లు. తన వారసులు బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. డెల్ఫిన్ ఆర్నాల్ట్(49) 2023లో మాంటిల్‌ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆంటోయిన్ ఆర్నాల్ట్(46) ఎల్‌వీఎంహెచ్‌ కమ్యూనికేషన్స్, ఇమేజ్ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్ ఇనిషియేటివ్‌ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. అలెగ్జాండర్‌ ఆర్నాల్ట్(31) కమ్యూనికేషన్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ఫ్రెడెరిక్‌ ఆర్నార్ట్‌(29)ట్యాగ్‌హ్యూర్‌ పదవీకాలం తర్వాత 2024లో ఎల్‌వీఎంహెచ్‌ వాచెస్‌కు సీఈఓగా చేరారు. జీన్ ఆర్నాల్ట్(25) 2021లో ఎల్‌వీఎంహెచ్‌లో చేరారు. లూయిస్ విట్టన్ వాచీల విభాగానికి మార్కెటింగ్ హెడ్‌గా చేస్తున్నారు.

అదానీ గ్రూప్

గౌతమ్ అదానీ ఛైర్మన్‌గా ఉన్న ఈ గ్రూప్‌ సంపద సుమారు 102.4 బిలియన్ అమెరికన్‌ డాలర్లు. ఆయనకు కరణ్, జీత్ అదానీలు ఇద్దరు కుమారులు. పర్డ్యూ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన కరణ్ తన తండ్రి తర్వాత అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్‌) మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జీత్ అదానీ 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు.

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్

షాపూర్ మిస్త్రీ స్థాపించిన ఈ గ్రూప్‌ సంపద 37.7 బిలియన్ యూఎస్‌ డాలర్లుగా ఉంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసుడిగా పల్లోన్ మిస్త్రీ సంస్థను ముందుండి నడిపిస్తున్నారు. ఈ గ్రూప్‌నకు నిర్మాణం, రియల్ ఎస్టేట్‌ రంగంలో మంచి పేరుంది. ఇందులో టాటా సన్స్‌ వాటా కలిగి ఉంది.

ఇదీ చదవండి: 15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్

లాఓరీల్‌ సంస్థ వ్యవస్థాపకుడు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ 94.5 బిలియన్‌ డాలర్ల సందప కలిగి ఉన్నారు. ప్రపంచంలోని ప్రముఖ సౌందర్య సాధనాల దిగ్గజ సంస్థగా లాఓరీల్‌కు మంచి పేరుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళ ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ వారసులు జీన్-విక్టర్, నికోలస్ మేయర్స్. జీన్-విక్టర్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో పనిచేస్తున్నారు. నికోలస్ మేయర్స్‌ కుంటుంబం పెట్టుబడి సంస్థకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement