
స్టార్టప్ బూమ్లో భారత్ దూసుకుపోతున్నప్పటికీ, యూపీఐ వంటి ఫిన్టెక్ విజయగాథలు మనకు ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితిని సమీక్షించుకోవాల్సిన అవసరముందని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి దేశంలోని ఉత్తమ సాంకేతిక మేధావులు విదేశాలకు వెళ్లకుండా ఉండాలంటే దేశానికి తీవ్రమైన రియాలిటీ చెక్ అవసరమని చెప్పారు.
ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన ఒక వివరమైన పోస్ట్ పెట్టారు. భారత ఇన్నోవేషన్ సామర్థ్యాలను నాలుగు కేటగిరీలుగా విశదీకరించారు. ఒక్కో అంశానికి మార్కులు సైతం ఇచ్చారు. దేశంలో ప్రైవేట్ రంగం ధృడంగా వ్యవహరించాలని, స్వదేశంలో నిజమైన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. విమానయాన సంస్థలు, బ్యాంకింగ్, రిటైల్ వంటి ప్రాసెస్ ఆధారిత రంగాల్లో భారత్ ప్రకాశిస్తున్నప్పటికీ, ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించడంలో వెనుకబడి ఉందని, మన టాలెంట్ (ప్రతిభావంతులు) విదేశాలకు వెళ్లిపోతోందని శ్రీధర్ వెంబు హెచ్చరించారు.
ప్రాసెస్ ఇన్నోవేషన్ లో భారత్ 70 శాతం మంచి స్కోర్ సాధిస్తుందని వెంబు అన్నారు. కానీ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ విషయషంలో మాత్రం కేవలం 35% మాత్రమే రేటింగ్ ఇచ్చారు. ఇది ఆశాజనకంగా ఉండవచ్చంటూ యూపీఐ ఆవిష్కరణను ఉదహరించారు. దేశానికి సమర్థవంతమైన ప్రాజెక్ట్ మేనేజర్లు మాత్రమే కాకుండా మరింత దూరదృష్టి కలిగిన ఉత్పత్తి సృష్టికర్తలు అవసరమని నొక్కి చెప్పారు.
ఇక టెక్నాలజీ విషయంలో శ్రీధర్ వెంబు అసలు స్కోరే ఇవ్వలేదు. అంతటితో ఆగకుండా తీవ్రమైన ఆందోళన వెలిబుచ్చారు. భారతదేశపు టాప్ టెక్ టాలెంట్ ను విదేశీ సంస్థలు తీసేసుకుంటున్నాయని, టెక్ టాలెంట్ను నిలుపుకోవడం, వెనక్కి తీసుకురావడం కోసం దేశ ప్రైవేటు రంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందు కోసం ఇక్కడ ప్రతిష్టాత్మక అవకాశాలను సృష్టించాల్సిన అవసరం ఉందని సూచించారు.
సైంటిఫిక్ పురోగతుల కేటగిరీకి స్కోర్ ఇవ్వడానికి ఈ విషయంలో "మనం కనీసం పరీక్ష కూడా రాయలేదు" అంటూ కఠువుగా వ్యాఖ్యానించారు. ఉత్పత్తులు, సాంకేతిక రంగాల్లో ప్రైవేటు సంస్థలు ముందంజలో ఉండాలని, డీప్ సైన్స్ కు ప్రభుత్వ నిధులు అవసరమని ఆయన అన్నారు. 20వ శతాబ్దపు అనేక ఆవిష్కరణలకు నాంది పలికిన ప్రఖ్యాత అమెరికన్ రీసెర్చ్ హబ్ బెల్ ల్యాబ్స్ వంటిది భారత్లోనూ రావాల్సిన అవసరం ఉందన్నారు.