
కోల్కతా: గృహాల నికర పొదుపులు గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) రూ.22 లక్షల కోట్ల మేర ఉండొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ తన అంచనాలు ప్రకటించింది. జాతీయ స్థూల ఖర్చు చేయతగిన ఆదాయం (జీఎన్డీఐ)లో ఇది 6.5 శాతానికి సమానమని పేర్కొంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో గృహ నికర పొదుపులు జీఎన్డీఐలో 5.1 శాతంగా ఉంటే, దీంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో 4.9 శాతం మేర పెరిగినట్టు తెలిపింది.
ఆర్థిక పొదుపులు పెరగడం అన్నది ప్రభుత్వం, కార్పొరేట్ నిధుల లోటును భర్తీ చేసేందుకు, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎంతో కీలకమని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. ఈ సందర్భంగా ఆర్బీఐ మిగులు నిల్వలను ప్రస్తావించింది. రూపాయి అస్థిరతల కట్టడికి సెంట్రల్బ్యాంక్ తీసుకునే చర్యలు ఈ పరిమాణాన్ని నిర్దేశిస్తాయని తెలిపింది. 2024–25లో ఆర్బీఐ బ్యాలన్స్ షీటు 8.19 శాతం విస్తరించగా.. అదే ఏడాది జీడీపీ వృద్ధి రేటు 9.9 శాతం కంటే తక్కువగా ఉన్నట్టు పేర్కొంది.
ఆర్బీఐ మిగులు నిల్వలు రూ.2.69 లక్షల కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేయడం (డివిడెండ్) ద్రవ్య వెసులుబాటును ఇస్తుందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో మోసాల కేసులు తగ్గినప్పటికీ.. మోసపోయిన మొత్తం మూడు రెట్లు పెరిగి రూ.36,014 కోట్లకు చేరినట్టు గుర్తు చేసింది.