సంపదలో సగం సమాజానికే ఇవ్వండి: మెలిండా గేట్స్ | Melinda French Gates Urges New Billionaires to Give Away Half Their Wealth | Sakshi
Sakshi News home page

సంపదలో సగం సమాజానికే ఇవ్వండి: మెలిండా గేట్స్

Jun 21 2026 4:28 PM | Updated on Jun 21 2026 4:49 PM

Melinda French Gates Urges New Billionaires to Give Away Half Their Wealth

ఇటీవల స్పేస్ఎక్స్ ఐపీఓ విజయవంతంగా పూర్తికావడంతో ఎందోమంది కోటీశ్వరులు, బిలియనీర్లుగా మారారు. భవిష్యత్తులో ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు కూడా  ఐపీఓకు వచ్చే అవకాశాలు ఉండటంతో మరింత మంది ధనవంతులు అవుతారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రపంచ ప్రఖ్యాత దాతృత్వవేత్త 'మెలిండా ఫ్రెంచ్ గేట్స్' (Melinda French Gates) ఓ కీలక సందేశాన్ని ఇచ్చారు.

మెలిండా ఫ్రెంచ్ గేట్స్ అభిప్రాయం ప్రకారం.. పెద్ద మొత్తంలో సంపద సంపాదించే అవకాశం లభించినవారు తమ సంపదలో కనీసం సగం భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలని ఇప్పటి నుంచే నిర్ణయించుకోవాలి. ఐపీఓల ద్వారా కోట్లాది డాలర్ల సంపద పొందగలిగే స్థితిలో ఉన్నవారికి, అదే స్థాయిలో దానం చేసే సామర్థ్యం కూడా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. సంపద అనేది కేవలం వ్యక్తిగత విజయానికి గుర్తు మాత్రమే కాదు, సమాజం పట్ల ఉన్న బాధ్యతకు కూడా ప్రతీక అని ఆమె పేర్కొన్నారు.

అమెరికాలో బిలియనీర్లుగా ఎదిగిన వారు దేశం అందించిన అవకాశాలను గుర్తుంచుకోవాలని మెలిండా సూచించారు. మంచి విద్యా వ్యవస్థ, ఆరోగ్య సేవలు, రహదారులు, సమాచార మౌలిక వసతులు వంటి ప్రజా వనరుల వల్లే పెద్ద కంపెనీలు అభివృద్ధి చెందగలిగాయని ఆమె వివరించారు. అందువల్ల సమాజం నుంచి లభించిన అవకాశాలను తిరిగి సమాజ అభివృద్ధికే ఉపయోగించాల్సిన బాధ్యత ధనవంతులపై ఉందని ఆమె చెప్పారు.

మెలిండా ఫ్రెంచ్ గేట్స్ వ్యక్తిగత సంపద సుమారు 19 బిలియన్ డాలర్లుగా అంచనా. ఆమె 2010లో వారెన్ బఫెట్, ఆమె మాజీ భర్త బిల్ గేట్స్‌తో కలిసి గివింగ్ ప్లెడ్జ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ సంపదలో ఎక్కువ భాగాన్ని జీవితకాలంలో గానీ, మరణానంతరం గానీ దానం చేయాలని ప్రతిజ్ఞ చేస్తారు.

ఇప్పటివరకు 250 మందికి పైగా ప్రముఖ దాతలు ఈ కార్యక్రమంలో చేరారు. వీరిలో మెకెంజీ స్కాట్, కాన్వా సహ వ్యవస్థాపకులు మెలానీ పెర్కిన్స్, క్లిఫ్ ఓబ్రెచ్ట్, ఎయిర్‌బీఎన్‌బీ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ చెస్కీ వంటి ప్రముఖులు ఉన్నారు.

గేట్స్ ఫౌండేషన్ నుంచి వైదొలిగిన తరువాత, మెలిండా తన స్వతంత్ర సంస్థ పివోటల్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మహిళల మధ్యవయస్సు ఆరోగ్యం, మెనోపాజ్ సంబంధిత సమస్యల కోసం 215 మిలియన్ డాలర్ల నిధులను ప్రకటించారు.

ధనవంతుల ప్రవర్తన గురించి అడిగినప్పుడు, సంపదను ఆడంబరంగా ప్రదర్శించడం తనకు నచ్చదని మెలిండా స్పష్టం చేశారు. అవసరమైన మంచి వస్తువులు కొనుగోలు చేయడంలో తప్పేమీ లేదు, కానీ సంపదను ప్రదర్శిస్తూ ఇతరులను ఆకర్షించే ప్రయత్నం చేయడం సమాజానికి ఎలాంటి మేలు చేయదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: భారత్ - ఈయూ ఒప్పందం: పీయూష్ గోయల్ కీలక ప్రకటన!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement