
దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరల ధోరణులకు అనుగుణంగా నెలవారీ సవరణలో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ 19 కిలోల సిలిండర్ ధరను రూ. 6.5 పెంచినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు తెలియజేశారు.
రేట్ల సవరణ తర్వాత కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ 19 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ. 1,646, ముంబైలో రూ.1,605, కోల్కతాలో రూ.1,764.50, చెన్నైలో రూ.1,817, హైదరాబాద్లో రూ.1,872 గా ఉంది. నాలుగు నెలలుగా వరుస తగ్గింపుల తర్వాత ఈ నెలలో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధరలు పెంచారు. చివరిసారిగా జూలై 1న రూ. 30 మేర ధర తగ్గింది. నాలుగు నెలల్లో మొత్తంగా రూ.148 తగ్గింది. స్థానిక పన్నులకు అనుగుణంగా వీటి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. అయితే, గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ 14.2 కిలోల సిలిండర్ ధర మాత్రం రూ.803 వద్ద ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది.
ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) బెంచ్మార్క్ అంతర్జాతీయ ఇంధనం, సగటు ధర, విదేశీ మారక విలువ ఆధారంగా ప్రతి నెల మొదటి తేదీన ఏటీఎఫ్, వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి.