దేశవ్యాప్తంగా పెరిగిన సిలిండర్‌ ధరలు | Commercial LPG cylinders become costlier from June 1 Full Details | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా పెరిగిన సిలిండర్‌ ధరలు

Jun 1 2026 6:43 AM | Updated on Jun 1 2026 7:21 PM

Commercial LPG cylinders become costlier from June 1 Full Details

దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌ తగిలింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ (LPG) సిలిండర్ల ధరలను మరోసారి పెంచారు. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన రేట్లతో.. రెస్టారెంట్లు, ఫుడ్‌ బిజినెస్‌లపై అదనపు భారం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే..

ఇంధన నిల్వలను బలోపేతం చేయడం, పెరుగుతున్న డిమాండ్‌ను సమర్థంగా నిర్వహించడం, అక్రమ నిల్వలు (హోర్డింగ్‌).. మళ్లింపులను అరికట్టడం వంటి చర్యల నేపథ్యంలో ఈ ధరల సవరణ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక.. కోట్లాది మంది గృహ వినియోగదారుకు ఊరట ఇస్తూ.. 14.2 కిలోల డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే 5 కిలోల ఫ్రీ ట్రేడ్‌ ఎల్పీజీ (FTL) సిలిండర్ ధరను కూడా రూ.11 పెంచారు. దీంతో.. రూ.821.50కు చేర్చారు. ప్రధాన నగరాల్లో కమర్షియలు సిలిండర్‌ ధరలు ఒక్కోలా ఉన్నాయి.

ఢిల్లీలో ఒక్క సిలిండర్‌పై రూ.42 పెరిగింది. దీంతో.. ధర రూ.3,113.50కు చేరుకుంది.  కోల్‌కతాలో రూ.53.50 పెంపు అమల్లోకి రావడంతో రూ.3,255.50గా మారింది. పెరిగిన రేట్లతో.. తెలంగాణ హైదరాబాద్‌లో(రూ.52 పెంపు) రూ.3,315, ఇటు ఏపీ విజయవాడలో రూ.3,251.50, విశాఖపట్నంలో రూ.3,146.50కి కమర్షియల్‌ సిలిండర్‌ ధర చేరింది. 

పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం..  దేశంలో ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ, సహజ వాయువు నిల్వలు తగినంతగా ఉన్నాయి. ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 90 వేల మెట్రిక్‌ టన్నుల గరిష్ఠ స్థాయికి చేరగా, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు కనీసం 30 రోజుల ఎల్పీజీ నిల్వలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశీయ అవసరాల కోసం రోజుకు సుమారు 72 వేల మెట్రిక్‌ టన్నుల ఎల్పీజీ డిమాండ్‌ ఉండగా, రిఫైనరీలు 50–52 వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి చేస్తున్నాయి. సరఫరా వ్యవస్థను మెరుగుపరచడంతో ఎల్పీజీ బ్యాక్‌లాగ్‌ 4.5 రోజులకు తగ్గినట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలు, భారీ మొత్తంలో కొనుగోళ్లు పెరగడంతో ఇంధన విక్రయాల్లో అసాధారణ వృద్ధి నమోదైందని ప్రభుత్వం గుర్తించింది. దేశవ్యాప్తంగా ఇంధన అమ్మకాలు 30 శాతానికి పైగా పెరగగా, 14 జిల్లాల్లో పెట్రోల్‌ విక్రయాలు 100 శాతానికి మించి పెరిగాయి. దీంతో అక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు.

గత నాలుగు రోజుల్లో ఎల్పీజీ పంపిణీకి సంబంధించిన 6,500 దాడులు నిర్వహించగా, ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. అలాగే పెట్రోల్‌ బంకుల్లో 900 తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో పెట్రోల్‌, డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవల ధరల మార్పులు ఎలా ఉన్నాయి?
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు అంతర్జాతీయ ఇంధన ధరలు, దిగుమతి వ్యయం, రవాణా ఖర్చులు, డిమాండ్‌ ఆధారంగా తరచూ మారుతూ ఉంటాయి. కానీ, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపార సంస్థలు ప్రధానంగా వినియోగించే వాణిజ్య ఎల్పీజీపై ఈ పెంపు ప్రభావం చూపిస్తూ వస్తోంది. 

ఎందుకు పెంచారు?

  • పశ్చిమాసియాలో యుద్ధం.. హర్ముజ్‌లో నిలిచిన చమురు రవాణా

  • దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎల్పీజీ డిమాండ్‌

  • వ్యూహాత్మక ఇంధన నిల్వలను బలోపేతం చేసే ప్రభుత్వ చర్యలు

  • ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు 30 రోజుల కనీస నిల్వల నిర్వహణ ఆదేశాలు

  • అక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టేందుకు కఠిన చర్యలు

  • సరఫరా వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు అవసరమైన నిర్వహణ వ్యయాలు

మొత్తంగా చూస్తే, వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు జూన్‌ నెల ప్రారంభంలోనే ధరల షాక్‌ తగిలింది. అయితే గృహ వినియోగదారులకు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి అదనపు భారం లేకపోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement