సంప్రదాయంగా ఉండక్కర్లేదు.. ఎందుకంటే.. | Kotak Said That Need To Respond Quickly To Risks In Financial Sector | Sakshi
Sakshi News home page

సంప్రదాయంగా ఉండక్కర్లేదు.. ఎందుకంటే..

Feb 22 2024 7:36 AM | Updated on Feb 22 2024 8:11 AM

Kotak Said That Need To Respond Quickly To Risks In Financial Sector - Sakshi

నియంత్రణ సంస్థలు మరీ సంప్రదాయకంగా ఉండాల్సిన అవసరం లేదని, ఆర్థిక రంగంలో ప్రమాదాలకు వేగంగా స్పందించాల్సిందేనని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ ఉదయ్‌ కోటక్‌ వ్యాఖ్యానించారు.

కేవైసీ నిబంధనల అమలులో వైఫల్యానికి గాను ఇటీవలే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ నిషేధం విధించడం తెలిసిందే. ఈ తరుణంలో ఉదయ్‌ కోటక్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘అసలు ప్రమాదాలే లేని విధానం ప్రమాదకరమైంది. వేగంగా వృద్ధి చెందాలని కోరుకునేట్టు అయితే, చక్కని నియంత్రణలు కూడా అవసరమే. కొన్ని ప్రమాదాలు తలెత్తొచ్చు. కానీ, ఎంత వేగంగా స్పందించాం, చక్కదిద్దామన్నదే కీలకం’’అని ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ ఆసోసియేషన్‌ (ఏఐఎంఏ) నిర్వహించిన సమావేశంలో భాగంగా ఉదయ్‌ కోటక్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పిల్లల కోసం ‘ఎల్‌ఐసీ అమృత్‌బాల్‌’.. ప్రత్యేకతలివే..

గతం తాలూకూ మచ్చలు నియంత్రణ సంస్థలను మరింత రక్షణాత్మకంగా లేదా అప్రమత్తంగా మార్చకూడదంటూ, అదే సమయంలో మెరుగైన నియంత్రణ వాతావరణం అవసరమేనన్నారు. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ గురించి ప్రస్తావన రాగా, ‘‘విడిగా వేరే కంపెనీ గురించి నేను వ్యాఖ్యానించను. కానీ, ఆర్‌బీకి మీ కంటే, నా కంటే ఎక్కువే తెలుసు’’అని పేర్కొన్నారు. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ మార్చి 15 తర్వాత నుంచి ఎలాంటి డిపాజిట్లు స్వీకరించరాదని ఆర్‌బీఐ నిషేధించడం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement