
మీరు ఐటీ ఉద్యోగులా?. అయితే మీ నెత్తిన మరో గుదిబండ పడబోతోంది!. త్వరలో ఐటీ రంగంలో పనిగంటలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరులో తొలి అడుగు పడబోతోంది. ఐటీ సెక్టార్లో పని గంటలను పెంచే యోచనలో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటూ దక్కన్ హెరాల్డ్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.
ప్రస్తుతం కర్నాటకలో సెక్షన్7,కర్ణాటక షాప్స్, కమిర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ 1961 ప్రకారం.. 9 పని గంటలు కొనసాగుతున్నాయి. పండగలు, పబ్బాలు వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కనీసం సంవత్సరంలో ఏదైనా మూడు నెలల్లో ఉద్యోగులతో అదనంగా 10 గంటలు పనిచేయించుకోవచ్చు. ఈ పనిగంటలు 50 గంటలు మించకూడదు.

కానీ కర్ణాటక ప్రభుత్వం తాజాగా కొత్త పనిగంటల ప్రతిపాదనలు తెరపైకి తెరపైకి తెచ్చినట్లు దక్కన్ హెరాల్డ్ హైలెట్ చేసింది. ఉద్యోగులు ఇకపై 10 పని గంటలు, అదనంగా 12 గంటలు పనిచేయించుకుంటే ఎలా ఉంటుందా? అనే దిశగా ప్రభుత్వం కార్మికశాఖ, ఐటీ రంగ నిపుణులతో చర్చలు జరుపుతోంది. ఫలితంగా ప్రత్యేక సందర్భాలలో అదనంగా చేసే పనిగంటలు 50 నుంచి ఏకంగా 140 గంటలు చేరుకోనున్నాయి.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పనిగంటల్ని పెంచి ఉద్యోగుల హక్కుల కాలరాజేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. పనిగంటలు పెంచడం వల్ల ఉద్యోగులు తమ హక్కులపై ప్రతికూల ప్రభావంతో పాటు పర్సనల్ లైఫ్, ఫ్రొఫెషనల్ లైఫ్కు విఘాతం కలుగుతోందని అంటున్నారు.

కర్ణాటకతో పాటు ఏపీలో కూటమి ప్రభుత్వంపై సైతం పనిగంటల్ని పెంచే ప్రతిపాదనలు తెరపైకి తెచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు ఇన్వెస్టర్లను ఆకట్టుకునేలా తొమ్మిది పనిగంటల్ని పది పనిగంటలు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
ఉద్యోగులకు, సంస్థలకు లబ్ధి చేకూరేలా కార్మిక చట్టాల్ని మార్చే యోచనలో ఉందని డక్కెన్ హెరాల్డ్ తన కథనంలో ప్రస్తావించింది. అంతేకాదు పనిగంటలు పెంచి పనిచేసే ప్రాంతాల్లో రాత్రి వేళ పనిదినాల్లో మహిళలకు వెసులు బాటు కల్పించడంతో పాటు రవాణ, భద్రత, సెక్యూరిటీ, లైటింగ్ మెరుగుపరుచుకునే దిశగా చర్యలు తీసుకోనుందని వెల్లడించింది.
పని గంటలను పొడిగించాలనే ప్రభుత్వ ప్రణాళికను కర్ణాటకలోని అనేక కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. బుధవారం, రాష్ట్ర కార్మిక శాఖ పరిశ్రమ, కార్మిక సంఘాల ప్రతినిధులతో ఒక సమావేశాన్ని నిర్వహించి చట్టానికి సాధ్యమయ్యే సవరణపై చర్చించింది.

కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) సమావేశంలో పాల్గొని ఈ ఆలోచనను స్పష్టంగా వ్యతిరేకించింది. కేఐటీయూ ఈ ప్రతిపాదనను బానిశత్వంగా అభివర్ణించింది. కార్మికుల ఆరోగ్యం, పని-జీవిత సమతుల్యత, ఉద్యోగ భద్రతకు హాని కలిగిస్తుందని పేర్కొంది. పనిగంటల విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనల్ని టెక్నాలజీ రంగ ఉద్యోగులు వ్యతిరేకించాలని, వారికి అండగా నిలవాలని యూనియన్ విజ్ఞప్తి చేసింది.

పనిగంటలు పెరిగితే భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులు.. ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.