ప్రపంచంలోని టాప్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జామీ డిమోన్ టెక్నాలజీలో వస్తున్న మార్పులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మొన్నటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకించిన డిమోన్.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వల్ల పని దినాలు తగ్గుతాయని అంచనా వేయడం గమనార్హం.
వారానికి 3.5 రోజుల పనే!
బ్లూమ్బెర్గ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిమోన్ మాట్లాడుతూ.. ఏఐ ప్రభావంతో భవిష్యత్ తరాల జీవనశైలి పూర్తిగా మారిపోతుందని పేర్కొన్నారు. ‘వచ్చే మూడు నాలుగు దశాబ్దాల్లో మన పిల్లలు వారానికి కేవలం నాలుగు లేదా మూడున్నర రోజులు మాత్రమే పని చేసే స్థాయికి ఏఐ ఉత్పాదకతను పెంచుతుంది’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికత వల్ల పని గంటలు తగ్గి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపడటం అనేది ఒక అద్భుతమైన విషయం అన్నారు.
జేపీ మోర్గాన్లో ఇప్పటికే ఏఐ జోరు
కేవలం అంచనాలు వేయడమే కాకుండా, తన బ్యాంకులో ఇప్పటికే ఏఐని భారీగా వినియోగిస్తున్నట్లు డిమోన్ వెల్లడించారు. మోసాల గుర్తింపు, రిస్క్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఎర్రర్ రిడక్షన్ వంటి చాలా విభాగాల్లో ఏఐని వాడుతున్నట్లు చెప్పారు. సంస్థలోని సుమారు 1,50,000 మంది ఉద్యోగులు ఇప్పటికే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
‘సాంకేతికత ఎప్పుడూ ఉద్యోగాలను మారుస్తూనే ఉంటుంది. కానీ ఏఐ తెచ్చే మార్పులు వేగంగా ఉంటాయి. ప్రభుత్వం, వ్యాపార సంస్థలు ఈ మార్పునకు ఇప్పుడే సిద్ధం కావాలి’ అని జామీ డిమోన్ తెలిపారు.
ఉద్యోగ ముప్పుపై హెచ్చరిక
ఒకవైపు ఆశావాదాన్ని ప్రకటిస్తూనే, మరోవైపు ఉద్యోగాల తొలగింపుపై డిమోన్ వాస్తవాలను బయటపెట్టారు. పరిశ్రమలు ఏఐని స్వీకరించే క్రమంలో ఉద్యోగాల నష్టాన్ని తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరించారు. రాబోయే ఐదేళ్లలో ఏఐ వల్ల పెరిగే ఉత్పాదకత కారణంగా బ్యాంకులో తక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉంటుందని అంగీకరించారు. ఉద్యోగాలు కోల్పోయే వారిని ఎలా ఆదుకోవాలనే అంశంపై ప్రభుత్వాలు, సంస్థలు ఆలోచించాలని సూచించారు.
ఇదీ చదవండి: ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం!


