కొత్త టెక్నాలజీతో నైపుణ్యాలు పెరుగుతాయి
మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్
కృత్రిమ మేథ (ఏఐ)తో టెక్ పరిశ్రమ ఉద్యోగాల్లో భారీగా కోత పడుతుందన్న ఆందోళనలను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ తోసిపుచ్చారు. దీనివల్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్కి ముప్పేమీ లేదని, ఇది వారి స్థానాన్ని భర్తీ చేయదని చెప్పారు. వారు తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు ఏఐ సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు మరింత స్మార్ట్గా పని చేసుకునేందుకు తోడ్పడే టెక్నాలజీని రూపొందించడం మైక్రోసాఫ్ట్ లక్ష్యమని ఆయన చెప్పారు.
పదే పదే పునరావృతమయ్యే కోడింగ్ పనులను మాత్రమే ఏఐ టేకోవర్ చేయొచ్చని, దీనితో ప్రోడక్ట్ డిజైన్, ఆర్కిటెక్చర్, టెస్టింగ్, భద్రత మొదలైన వాటిపై ఫోకస్ చేసేందుకు డెవలపర్లకు వీలు చిక్కుతుందని స్మిత్ తెలిపారు. ఉద్యోగాలను తగ్గించడం కాకుండా వాటిని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఏఐ సహాయపడుతుందని చెప్పారు. దీనితో నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని, వేతనాలు కూడా పెరుగుతాయని స్మిత్ వివరించారు.
ప్రజల సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు ఉపయోగపడే టెక్నాలజీని, మెషిన్లను తయారు చేయడమే మైక్రోసాఫ్ట్ ప్రాథమిక లక్ష్యమని ఆయన చెప్పారు. సాంకేతికత అనేది ఉత్పాదకత, ఆర్థిక వృద్ధికి చోదకంగా ఉంటూనే అత్యంత నాణ్యమైన ఉద్యోగాల కల్పనకు దోహదపడే విధంగా ఉండాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత


