బంగారం ధరలు తగ్గుతాయనుకుంటున్న పసిడి ప్రియులకు జేపీ మోర్గాన్ రిపోర్ట్ షాకిచ్చింది. 2026లో గోల్డ్ రేటు ఎంతకు చేరుతుందో అంచనా వేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఔన్సు గోల్డ్ రేటు 5200 డాలర్ల వద్ద ఉంది. ఇది 2026 చివరి నాటికి 6300 డాలర్లకు చేరుకుంటుందని జేపీ మోర్గాన్ తన నివేదికలో వెల్లడించింది. ధరలు పెరగడానికి ప్రధాన కారణం భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మాత్రమే కాదు, ఆర్ధిక అనిశ్చితి కూడా ప్రధాన కారణమని స్పష్టం చేసింది.
సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు పెరగడం, యూఎస్ ట్రెజరీ ఉపసంహరణకు సంబంధించిన బహిరంగ ప్రకటనలు కూడా గోల్డ్ రేటు పెరగడానికి కారణం అవుతోంది. బంగారం రేటు పెరుగుతుందని జేపీ మోర్గాన్ మాత్రమే కాకుండా.. మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మన్ సాచ్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా మొదలైన బ్రోకరేజ్/ఏజెన్సీలు చెబుతున్నాయి.
భారతదేశంలో బంగారం ధరలు
భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,61,570 వద్ద, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,48,100 రూపాయల వద్ద ఉంది. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే.. ఈ ఏడాది చివరి నాటికి తులం పసిడి ధర రూ.2 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
బంగారం రేటు అందుకే పెరుగుతోంది
సాధారణంగా భారతీయులు పండుగలకు, పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా బంగారం ధరిస్తారు. దీనివల్ల పసిడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాగా ఇప్పుడు దేశంలో పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైపోయింది. ఇది కూడా గోల్డ్ రేటు పెరగడానికి కారణం అవుతోంది. బంగారం సురక్షితమైన ఆస్తిగా భావించేవారు కూడా ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. ఇవన్నీ బంగారం ధరలను భారీగా పెంచేస్తున్నాయి.
ఇదీ చదవండి: 25 ఏళ్లకే మిలియనీర్ను చేసిన కియోసాకి బుక్


