
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తీసుకొచ్చిన అప్డేటెడ్ టాలెంట్ డిప్లాయ్మెంట్ పాలసీని ఐటీ ఉద్యోగుల సంఘం ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీఈయూ) వ్యతిరేకిస్తోంది. కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తూ ఉద్యోగులను తగ్గించుకునేందుకే టీసీఎస్ ఈ కొత్త పాలసీని తీసుకొచ్చిందంటూ ఏఐటీఈయూ అభివర్ణించింది.
టీసీఎస్ అప్డేటెడ్ టాలెంట్ డిప్లాయ్మెంట్ పాలసీలో ఇకపై ప్రతి ఉద్యోగి ఏడాదికి 225 బిల్ల్డ్ బిజినెస్ డేస్ పనిచేసి ఉండాలన్న నిబంధన తీసుకొచ్చింది. పని లేకుండా బెంచ్ మీద ఉండే సమయాన్ని 35 రోజులకు పరిమితం చేసింది. జూన్ 12 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చినట్లు ఉద్యోగులకు యాజమాన్యం తెలియజేసింది. ఆర్ఎంజీ నుంచి తగిన బిల్లబిలిటీ ఉండేలా చూడాల్సిన బాధ్యతను ఉద్యోగులకే బదలాయించాలనే దురుద్దేశం కూడా ఈ విధానంలో ఉంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనుకున్నప్పుడల్లా కార్మిక వ్యతిరేక విధానమైన పనితీరు మెరుగుదల ప్రణాళిక (పీఐపీ) ద్వారా టీసీఎస్ యాజమాన్యం చేసే ప్రయత్నం ఇది" అని ఏఐటీఈయూ తెలిపింది.
విడుదల తేదీకి ముందే కేటాయింపు కోసం రిసోర్స్ మేనేజ్ మెంట్ గ్రూప్ తో క్రియాశీలకంగా వ్యవహరించడం, అవకాశాలను అందిపుచ్చుకోవడం ఉద్యోగుల ప్రాథమిక బాధ్యత అని ఈ విధానం నొక్కి చెబుతోంది. ఫ్రెషర్స్ కూడా పని కేటాయింపు కోసం చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు డిప్లాయిమెంట్ పాలసీని పాటించకపోతే చర్యలు తప్పవని కంపెనీ హెచ్చరిస్తోంది. "ఈ విధానం నిబంధనలను పాటించడంలో ఉద్యోగి విఫలమైనట్లయితే, సంస్థ క్రమశిక్షణా చర్యల ఫ్రేమ్వర్క్ ప్రకారం సేవల నిలిపివేతతో సహా క్రమశిక్షణా చర్యలు తీసుకునే హక్కు సంస్థకు ఉంది" అని ఉద్యోగులకు పంపిన పాలసీ డాక్యుమెంట్ పేర్కొంది.
ఈ చర్యను వ్యతిరేకిస్తున్న యూనియన్ "ఉద్యోగులకు తగినంత బిల్లబిలిటీని నిర్ధారించడానికి టీసీఎస్ ఆర్ఎంజీ బాధ్యత వహిస్తుంది. కార్మికుల శ్రమను దోపిడీ చేసి లాభాలు, సంపదను కాపాడుకోవడంపై మాత్రమే దృష్టి పెడుతూ కార్మికుల హక్కులను కాలరాసే ఎంఎన్సీల విధానాలను ఏఐఐటీఈయూ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’ అని పేర్కొంది.