న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ/రైల్వే శాఖకు చెందిన ఆర్థిక సంస్థ)లో కేంద్ర ప్రభుత్వం 2 శాతం వాటాల విక్రయానికి ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)ను ప్రకటించింది. నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు బుధవారం ఈ విక్రయం ఆరంభమైంది. మొత్తం 26.13 కోట్ల షేర్లను.. ఒక్కోటీ రూ.91 ఫ్లోర్ ధరపై విక్రయించనుంది.
బీఎస్ఈలో మంగళవారం ముగింపు ధర రూ.98.69 కంటే 7.79 శాతం తక్కువకు ఆఫర్ చేస్తోంది. దీని ప్రకారం ప్రభుత్వానికి రూ.2,300 కోట్లు సమకూరనున్నాయి. ఒక శాతం వాటాను ప్రభుత్వం ఆఫర్ చేయనుందని, డిమాండ్ ఆధారంగా మరో ఒక శాతం వాటాను గ్రీన్ షూ ఆప్షన్ కింద విక్రయించనున్నట్టు పెట్టుబడులు, ప్రజాస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) కార్యదర్శి అరుణీష్ చావ్లా ఎక్స్ ప్లాట్ఫామ్పై చేసిన పోస్ట్లో పేర్కొన్నారు.
రిటైల్ ఇన్వెస్టర్లకు ఓఎఫ్ఎస్ గురువారం ప్రారంభం కానుంది. ఐఆర్ఎఫ్సీలో కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 84.65 శాతం వాటా ఉంది.


