భారత్‌లో ఐఫోన్‌ టాప్‌ | iPhone Was Top Selling Model In India Says Apple CEO Tim Cook, Check More Details Inside | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఐఫోన్‌ టాప్‌

Feb 1 2025 6:25 AM | Updated on Feb 1 2025 4:16 PM

iPhone Was Top Selling Model In India says  Apple CEO Tim Cook

యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌

న్యూఢిల్లీ: ‘భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌గా ఐఫోన్‌ అవతరించింది. రికార్డు స్థాయిలో వ్యాపారాన్ని నమోదు చేసిన భారత్‌పై కంపెనీ చాలా ఆసక్తిగా ఉంది’ అని యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ శుక్రవారం తెలిపారు. కౌంటర్‌పాయింట్‌ రిసర్చ్‌ ప్రకారం భారత స్మార్ట్‌ఫోన్‌ విపణిలో 2024లో విలువ పరంగా 23 శాతం వాటాతో యాపిల్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే స్మార్ట్‌ఫోన్స్‌ సంఖ్య పరంగా టాప్‌–5గా నిలిచింది. ‘అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో గొప్ప ఫలితాలను సాధించాం. ముఖ్యంగా భారత్‌పై నేను ఆసక్తిగా ఉన్నాను. 

డిసెంబర్‌ త్రైమాసికంలో భారత్‌ రికార్డును నెలకొల్పింది. ఈ త్రైమాసికంలో ఐఫోన్‌ అత్యధికంగా అమ్ముడైంది. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్లకు రెండవ అతిపెద్ద, పర్సనల్‌ కంప్యూటర్స్, టాబ్లెట్‌ పీసీలకు భారత్‌ మూడవ అతిపెద్దది మార్కెట్‌. కాబట్టి ఇక్కడ భారీ మార్కెట్‌ ఉంది. మరిన్ని యాపిల్‌ ఔట్‌లెట్లను ప్రారంభించే యోచనలో ఉన్నాం. యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ను విస్తరిస్తున్నాం. స్థానికీకరించిన ఇంగ్లీష్‌ వెర్షన్‌ను భారత్‌లో ఏప్రిల్‌లో విడుదల చేస్తాం’ అని టిమ్‌ కుక్‌ వివరించారు. కాగా, డిసెంబర్‌ త్రైమాసికంలో యాపిల్‌ మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో 4 % వృద్ధితో 124.3 బిలియన్‌ డాలర్లు నమోదైందని వెల్లడించారు. లాభం 7 శాతం క్షీణించి 33.91 బిలియన్‌ డాలర్లకు చేరింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement