క్లౌడ్ సర్వీసులందించే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సేల్స్ ఫోర్స్ తమ సంస్థలో భారీ మార్పులు చేపట్టాలని నిర్ణయించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని పెంచుతూ, పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో ఫిబ్రవరి ప్రారంభంలో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం ఈ లేఆఫ్స్ కేవలం సాధారణ విభాగాలకే పరిమితం కాలేదు. కంపెనీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏజెంట్ ఫోర్స్ ఏఐ ఉత్పత్తి విభాగంతో పాటు ఇతర విభాగాల్లోని ఉద్యోగులపై ప్రభావం పడింది.
కంపెనీలో పనిచేస్తున్న మార్కెటింగ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లోనూ ఈ లేఆఫ్స్ ప్రభావం పడింది. లింక్డ్ఇన్ పోస్ట్లు, కంపెనీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం సంస్థ తన ఏఐ కార్యకలాపాలను పునర్నిర్మించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టెక్ పరిశ్రమలో లేఆఫ్స్ పరంపర
ఏఐ టూల్స్కు పెరుగుతున్న ఆదరణతో కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు ఉద్యోగ కోతలను విధిస్తున్నాయి. వచ్చే మూడు నెలల వ్యవధిలో అమెజాన్ ఏకంగా 16,000 కొలువులను తొలగిస్తున్నట్లు జనవరిలో ప్రకటించింది. గతేడాది ఆగస్టులో జరిగిన ఒక పాడ్కాస్ట్లో సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ మాట్లాడుతూ.. ఏఐ ప్రభావం వల్ల కస్టమర్ సపోర్ట్ విభాగంలో తక్కువ మంది సిబ్బంది సరిపోతారని అందుకే అప్పట్లో 4,000 మంది ఉద్యోగులను తగ్గించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్


