
సరికొత్త ఆవిష్కరణలు ఉండటం లేదు
కౌన్సిలేజ్ ఇండియా మేనేజింగ్ పార్ట్నర్ సేథ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: చాలా మటుకు దేశీ అంకుర సంస్థలు, పాశ్చాత్య బిజినెస్ మోడల్స్ను అనుకరిస్తున్నాయే తప్ప భారత్ అవసరాలకు అనుగుణంగా సిసలైన, సరికొత్త ఆవిష్కరణలేమీ చేయడం లేదని కౌన్సిలేజ్ ఇండియా మేనేజింగ్ పార్ట్నర్ సుహేల్ సేథ్ ఆక్షేపించారు. ‘భారత్లో స్టార్టప్ వ్యవస్థను చూస్తే, దాదాపు అన్నీ కూడా ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో చేసిన వాటికి కాపీలుగా ఉంటున్నాయి.
వడా పావ్ దుకాణం మొదలుపెట్టినా స్టార్టప్ అనేస్తున్నారు‘ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశీయంగా స్టార్టప్ల సంభాషణలు ఎంత సేపు వేల్యుయేషన్లు, యూనికార్న్ హోదా, వ్యవస్థాపకుల సంపదలాంటి అంశాల చుట్టూనే తిరుగుతుంటాయన్నారు. ఈ నేపథ్యంలో స్టార్టప్కు నిర్దిష్ట నిర్వచనం ఉండాలని సీఐఐ వార్షిక బిజినెస్ సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. స్టార్టప్ అంటే సాంకేతికంగా వినూత్నమైనదిగా, విశిష్టమైనదిగా, మరో దాన్ని పోలి ఉండని విధంగా, స్ఫూర్తివంతంగా ఉండాలని చెప్పారు.
చైనాకు పోటీనివ్వగలం: థర్డ్ఐటెక్ సీఈవో కపూర్
పరిశ్రమలో నిపుణుల లభ్యతపరంగా చైనాకి గట్టి పోటీనివ్వగలిగే ఏకైక దేశం భారత్ అని ఫ్యాబ్లెస్ చిప్ల తయారీ సంస్థ థర్డ్ఐటెక్ సీఈవో వృందా కపూర్ తెలిపారు. అనేక గ్లోబల్ టెక్ దిగ్గజాలు పలు దశాబ్దాలుగా భారత్లో పెద్ద ఎత్తున పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ఇందుకు దోహదపడిందని వివరించారు. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల డిజైనింగ్ నిపుణుల్లో 20 శాతం మంది హైదరాబాద్, బెంగళూరు, పుణెలో ఉన్నారని కపూర్ తెలిపారు. ఈ నేపథ్యంలో సైమీకండక్టర్ల తయారీ సామర్థ్యాల్లో, ముఖ్యంగా డిఫెన్స్ ఎల్రక్టానిక్స్లో చైనా ఆధిపత్యానికి చెక్ చెప్పగలిగే సామర్థ్యాలు భారత్కి ఉన్నాయని వివరించారు.