టాటా స్టీల్‌, గల్ఫ్‌ ఆయిల్‌ లూబ్రికెంట్స్‌కు లాభాలు | indian companies quarterly results tata steel and gulf oil lubricants | Sakshi
Sakshi News home page

టాటా స్టీల్‌, గల్ఫ్‌ ఆయిల్‌ లూబ్రికెంట్స్‌కు లాభాలు

Nov 7 2024 8:51 AM | Updated on Nov 7 2024 8:51 AM

indian companies quarterly results tata steel and gulf oil lubricants

టాటా స్టీల్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో తిరిగి లాభాల్లోకి అడుగు పెట్టింది. రూ.759 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.6,511 కోట్ల నష్టం ఎదురుకావడం గమనార్హం. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.55,910 కోట్ల నుంచి రూ.54,503 కోట్లకు తగ్గింది. కంపెనీ వ్యయాలను గణనీయంగా తగ్గించుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో వ్యయాలు రూ.55,853 కోట్లుగా ఉంటే, సమీక్షా త్రైమాసికంలో రూ.52,331 కోట్లకు పరిమితమయ్యాయి.

సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.4,806 కోట్ల మూలధన వ్యయాలను వెచ్చించింది. కంపెనీ నికర రుణభారం రూ.88,817 కోట్లుగా ఉంది. కంపెనీ వద్ద రూ.26,028 కోట్ల లిక్విడిటీ ఉంది. టాటా స్టీల్‌ యూకే ఆదాయం 600 మిలియన్‌ పౌండ్లుగా ఉంటే, 147 మిలియన్‌ పౌండ్ల ఎబిట్డా నష్టం నమోదైంది. నెదర్లాండ్‌ కార్యకలాపాల నుంచి 1,300 మిలియన్‌ పౌండ్ల ఆదాయం రాగా, 22 మిలియన్‌ పౌండ్ల ఎబిట్డా నమోదైంది. దేశంలోనే అతిపెద్ద బ్లాస్ట్‌ ఫర్నేస్‌ కళింగనగర్‌ ప్లాంట్‌ ప్రారంభమైనట్టు సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయంగా నిర్వహణ వాతావరణం ఎంతో సంక్లిష్టంగా ఉన్నట్టు టాటా స్టీల్‌ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్‌ పేర్కొన్నారు. కొన్ని కీలక ప్రాంతాల్లో వృద్ధి స్దబ్దుగా ఉన్నట్టు అంగీకరించారు. యూకే ప్రభుత్వంతో నిధులపై ఒప్పందాన్ని చేసుకున్నామని, గ్రీన్‌ స్టీల్‌కు మళ్లే దిశగా పురోగతిలో ఉన్నట్టు చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టాటా స్టీల్‌ షేరు ధర ఒక శాతం లాభపడి రూ.154 వద్ద స్థిరపడింది.

ఇదీ చదవండి: ట్రంప్‌ మానియా..ఐటీపై ప్రభావం ఎంత?

గల్ఫ్‌ ఆయిల్‌ లూబ్రికెంట్స్‌.. ఫర్వాలేదు

గల్ప్‌ ఆయిల్‌ లూబ్రికెంట్స్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్‌ త్రైమాసికంలో సానుకూల వృద్ధిని నమోదు చేసింది. నికర లాభం 15 శాతం వృద్ధితో రూ.84 కోట్లకు, ఆదాయం 6 శాతం పెరిగి రూ.849 కోట్లకు చేరాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.74 కోట్లు, ఆదాయం రూ.802 కోట్లుగా ఉండడం గమనార్హం. అనిశి్చత మార్కెట్‌ పరిస్థితుల్లో మంచి పనితీరు చూపించినట్టు కంపెనీ ప్రకటించింది. మార్జిన్లను కాపాడుకోవడంపై దృష్టి పెట్టామని, దీంతో స్థూల మార్జిన్లలో మెరుగుదల నమోదైనట్టు కంపెనీ సీఎఫ్‌వో మనీష్‌ గంగ్వాల్‌ తెలిపారు. లాభదాయకత పెంచుకోవడం ద్వారా వాటాదారులకు మరింత విలువ సమకూర్చుతామని ప్రకటించారు. డిమాండ్‌పై సానుకూల అంచనాలతో ఉన్నామని, మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి భారత లూబ్రికెంట్ల రంగంపై విశ్వాసంతో ఉన్నట్టు చెప్పారు. పటిష్ట ఫలితాలతో బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 6 శాతం ఎగసి రూ.1,263 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement