రాంచీ: అధునాతన గ్రేడ్ ఉక్కును తయారు చేసే దిశగా జంషెడ్పూర్ ప్లాంటుపై రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ఉన్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు. ఇందుకోసం తాము రూపొందించిన టెక్నాలజీతో ఉక్కు ప్రాసెసింగ్ వేగవంతమవుతుందని, అలాగే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయని చెప్పారు.
నెదర్లాండ్స్లో ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం అయిన నేపథ్యంలో 2030 నాటికి జంషెడ్పూర్లో 1 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. హైడ్రోజన్ ట్రక్కులపై కూడా టాటా మోటర్స్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. ఇక జార్ఖండ్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని టాటా గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


