
2030 నాటికి 9 బిలియన్ డాలర్లు కావాలి
6,900 ఎకరాల స్థలం అవసరం
సెవిల్స్ ఇండియా నివేదిక
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మౌలిక సదుపాయాల కోసం భారీ స్థాయిలో స్థలం, పెట్టుబడుల అవసరం ఏర్పడనుంది. 2030 నాటికి ఈవీల తయారీ, లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తి, పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల కోసం సుమారు 6,900 ఎకరాల స్థలం, 9 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు కావాల్సి ఉంటాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సెవిల్స్ ఇండియా ఒక నివేదికలో వెల్లడించింది. ఇటీవలి కాలంలో భారత ఈవీ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందినట్లు పేర్కొంది.
మార్కెట్ శక్తులు, ప్రభుత్వ విధానాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుండటం, ఇంధనాల ధరలు పెరుగుతుండటం తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించింది. ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, విద్యుత్ వాహనాల వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. ‘స్థల సమీకరణ తదితర అవసరాల కోసం 2030 నాటికి 7.5 బిలియన్ డాలర్ల నుంచి 9 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు కావాల్సి ఉంటుంది. అలాగే 5,760 నుంచి 6,852 ఎకరాల వరకు స్థలం అవసరమవుతుంది‘ అని సెవిల్స్ ఇండియా నివేదికలో తెలిపింది.
రియల్ ఎస్టేట్కి దన్ను..
ఈవీల వినియోగం పెరిగే కొద్దీ, దానికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా గణనీయంగా వృద్ధి చెందే అవకాశం ఉందని సెవిల్స్ ఇండియా ఎండీ (ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్) ఎన్ శ్రీనివాసన్ చెప్పారు. ఈవీలు .. బ్యాటరీల తయారీ, ఈవీ అసెంబ్లీ యూనిట్లు, ఈవీల విడిభాగాలు.. బ్యాటరీలను నిల్వ చేసేందుకు, పంపిణీ చేసేందుకు పారిశ్రామిక, వేర్హౌసింగ్ స్థలాలకు డిమాండ్ నెలకొంటుందని పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థలు విస్తరించే కొద్దీ వ్యూహాత్మక ప్రదేశాల్లో గిడ్డంగులు, లాజిస్టిక్స్ పార్కులకు కూడా డిమాండ్ ఏర్పడుతుందన్నారు.
‘వాతావరణ మార్పులు, ఇంధన భద్రతపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించడంపై దృష్టి పెట్టడంతో పాటు కొత్త ఆవిష్కరణలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనను ప్రోత్సహించడం ద్వారా పటిష్టమైన ఈవీ వ్యవస్థను ఏర్పర్చేందుకు ప్రభుత్వం విధానాలపరంగా చర్యలు తీసుకుంటోంది‘ అని శ్రీనివాసన్ వివరించారు. నీతి ఆయోగ్, రాకీ మౌంటెయిన్ ఇనిస్టిట్యూ ట్ (ఆర్ఎంఐ) నివేదికలకు తగ్గట్లు, ఏటా సగటున 42 నుంచి 53 లక్షల యూనిట్లు చొప్పున 2030 నాటికి దేశీయంగా ఈవీల అమ్మకాలు 2.53–3.18 కోట్ల యూనిట్లకు చేరవచ్చని రహదారి రవాణా, హైవేస్ శాఖ (ఎంవోఆర్టీహెచ్) అంచనా వేస్తోంది. దీని ప్రకారం తయారీ ప్లాంట్ల ఏర్పాటు కోసం 2,009 నుంచి 2,467 ఎకరాల వరకు స్థలం అవసరమవుతుందని సెవిల్స్ పేర్కొంది.