ఐటీలో ఒక్కో ఉద్యోగి వల్ల ఆదాయం ఎంతంటే.. | India IT Sector Sees Revenue Per Employee Rise Despite Earnings Slowdown | Sakshi
Sakshi News home page

ఐటీలో ఒక్కో ఉద్యోగి వల్ల ఆదాయం ఎంతంటే..

May 9 2025 12:27 PM | Updated on May 9 2025 1:47 PM

India IT Sector Sees Revenue Per Employee Rise Despite Earnings Slowdown

దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో 2025 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతి ఉద్యోగి ద్వారా సమకూరే ఆదాయం(రెవెన్యూ పర్‌ ఎంప్లాయి-ఆర్‌పీఈ) పెరిగింది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్‌ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల ద్వారా సమకూరే ఆదాయం ఏడేళ్ల గరిష్టాన్ని తాకినట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. మెరుగైన వనరుల వినియోగం, ఆటోమేషన్, కార్యాచరణ సామర్థ్యాల ద్వారా ఇది సాధ్యమైందని కంపెనీలు తెలిపాయి. కాగా, ఇటీవల సంస్థల త్రైమాసిక లాభాలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఒక్కో ఉద్యోగి ద్వారా 2024-25లో ఏయే సంస్థకు ఎంత సమకూరిందో కింద తెలుసుకుందాం.

టీసీఎస్: 49,638 డాలర్లు(సుమారు రూ.41.67 లక్షలు) గతేడాది కంటే ఇది 2.7 శాతం పెరిగి ఏడేళ్ల గరిష్టాన్ని చేరింది. టీసీఎస్‌ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 6,07,979.

ఇన్ఫోసిస్: 59,575 డాలర్లు(సుమారు రూ.50 లక్షలు). గతంలో కంటే 1.8% పెరిగి ఏడేళ్ల గరిష్టానికి చేరింది. ఇన్ఫోసిస్‌ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 3,17,240.

హెచ్‌సీఎల్‌ టెక్: 61,946 డాలర్లు (సుమారు రూ.51.9 లక్షలు). గతంలో కంటే 6.2% పెరిగింది.‍ హెచ్‌సీఎల్‌ టెక్‌ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 2,27,000.

  • విప్రో, టెక్ మహీంద్రా రెండూ ఆర్‌పీఈలో క్షీణతను నమోదు చేశాయి.

క్రమబద్ధీకరించిన కార్యకలాపాలు, సమర్థవంతంగా ప్రాజెక్ట్‌ల అమలు, అధునాతన ఆటోమేషన్ వ్యూహాల కారణంగా ఆర్‌పీఈలో మెరుగుదల కనిపించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, లేఆఫ్స్‌ పేరుతో ఇటీవల కాలంలో చాలామంది ఉద్యోగులను తొలగించడంతోనే కంపెనీలకు ఇలా ఆర్‌పీఈ పెరిగినట్లు కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: 60 నుంచి 45 ఏళ్లకు రిటైర్‌మెంట్‌ వయసు?

కంపెనీలకు లాభాలు ఉన్నప్పటికీ ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితితో ఐటీ రంగం సవాళ్లు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఐటీ సేవలకు డిమాండ్ మందగించడం, వ్యయ ఒత్తిళ్లు, లేఆఫ్స్‌ ఆందోళనలు భవిష్యత్ రాబడులపై ప్రభావం చూపనున్నాయని కొందరు అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలతో ఐటీ సంస్థలు స్కిల్ డెవలప్‌మెంట్‌, ఆటోమేషన్, కాస్ట్ ఎఫిషియెన్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement