డీల్‌తో ఎగుమతులకు బూస్ట్‌ | India Get Massive Benefits With the Peace Agreement Amid USA-Iran | Sakshi
Sakshi News home page

డీల్‌తో ఎగుమతులకు బూస్ట్‌

Jun 16 2026 5:26 AM | Updated on Jun 16 2026 5:26 AM

India Get Massive Benefits With the Peace Agreement Amid USA-Iran

రూపాయికి స్థిరత్వం 

తగ్గనున్న దిగుమతుల భారం 

ఇరాన్‌–అమెరికా శాంతి ఒప్పందంపై నిపుణుల అంచనాలు 

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో దాదాపు నాలుగు నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ, శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలన్న అమెరికా–ఇరాన్‌ నిర్ణయంతో భారత్‌కి ఊరట లభించనుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈసారైనా ఒప్పందం సజావుగా అమలైతే, పశ్చిమాసియాకి భారత్‌ ఎగుమతులు మళ్లీ పుంజుకునేందుకు ఊతం లభిస్తుందని ఎగుమతిదారులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దిగుమతి బిల్లుల భారం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతాయని, రూపాయి స్థిరపడగలదని భావిస్తున్నారు. వెరసి వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణం ఏర్పడవచ్చని వారు తెలిపారు.

 జూన్‌ 19 స్విట్జర్లాండ్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ‘ దాదాపు 50 శాతం క్రూడాయిల్, సుమారు 70 శాతం వంట గ్యాస్, 90 శాతం ద్రవీకృత సహజ వాయువు దిగుమతుల కోసం పశ్చిమాసియాపై భారత్‌ ఆధారపడుతోంది. అక్కడ ఉద్రిక్తతలతో సరఫరా సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో శాంతి ఒప్పందంతో భారత్‌కి తక్షణం ఆర్థికంగా ఊరట లభిస్తుంది. హార్మూజ్‌ జలసంధి తిరిగి తెరుచుకుంటే, ఇంధన మార్కెట్లు స్థిరపడతాయి. చమురు..గ్యాస్‌ ధరలపై ఒత్తిడి తగ్గి రూపాయి బలపడవచ్చు. భారత్‌ వృద్ధి అవకాశాలు మెరుగుపడొచ్చు‘ అని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు.  

అనిశ్చితికి తెర.. 
శాంతి ఒప్పంద ప్రకటనతో అనిశ్చితి, ఆర్థిక మందగమనం, అనవసర సమస్యలకి తెర పడుతుందని టెక్నోక్రాఫ్ట్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపక చైర్మన్‌ శరద్‌ కుమార్‌ సరాఫ్‌ తెలిపారు. ఎగుమతులు ఎగియడంతో పాటు కొత్త వ్యాపార అవకాశాలు కూడా లభించవచ్చన్నారు. మరోవైపు, పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే అంతర్జాతీయంగా ఇంధనాల సరఫరా, ధరలు తిరిగి సాధారణ స్థాయికి తిరిగి రావొచ్చని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ ఎస్‌సీ రాల్హన్‌ తెలిపారు. హార్మూజ్‌ మూసివేత వల్ల నౌకలు ఆఫ్రికా చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీనితో సముద్ర మార్గంలో రవాణా, నౌకల బీమా వ్యయాలు భారీగా పెరిగిపోవడంతో పాటు డెలివరీల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. హార్మూజ్‌ తెరుచుకుంటే నౌకల రాకపోకలకు కూడా వెసులుబాటు లభిస్తుందని నిపుణులు తెలిపారు.  

ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని నిరోధించే లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ఫిబ్రవరి 28న ఆ దేశంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దానితో మార్చిలో భారత్‌ ఎగుమతులు 7 శాతం క్షీణించి అయిదు నెలల కనిష్ట స్థాయి 38.92 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. పశ్చిమాసియాకి ఏకంగా 58 శాతం తగ్గి 3.5 బిలియన్‌ డాలర్లకు క్షీణించాయి. గల్ఫ్‌ దేశాల నుంచి దిగుమతులు 52 శాతం పడిపోయాయి. ఇక ఇంధనాల సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చాలా కాలం తర్వాత పెట్రోల్, డీజిల్‌ రేట్లను ఇటీవల పాక్షికంగా పెంచినప్పటికీ, అంతర్జాతీయంగా ఎగిసిన స్థాయికి తగ్గట్లు పెంచకపోవడంతో ఆదాయ నష్టాలను చవిచూస్తున్నాయి. అవి పూర్తి ఆర్థిక సంవత్సరపు లాభాలకు సరిసమానంగా ఒక్క త్రైమాసికంలోనే నష్టాలు నమోదు చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హార్మూజ్‌ జలసంధి తెరుచుకుంటే సరఫరా మెరుగుపడి, ముడి చమురు ధరలు నెమ్మదించవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement